కోహీర్, ఏప్రిల్14: మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు కోరారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లోగా వాటిని అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్కార్డు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఇందుకు జహీరాబాద్ వేదిక అయ్యిందన్నారు. సీఎం రేవంత్రెడ్డికి లక్షలాదిగా పోస్ట్కార్డులు పంపించాలన్నారు. పోస్ట్కార్డు ఉద్యమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. రైతుల వద్దకు వెళ్లి కాంగ్రెస్ చేస్తున్న మోసాల గురించి వివరించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోగా రూ.2లక్షల రుణమాఫీ, ధాన్యం, శనగలు, మక్కలకు రూ.500 బోనస్ ఇవ్వాలని, లేకుంటే రైతులు కర్రుకాల్చి వాతపెడతారన్నారు. హామీలు అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టమన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అన్యాయంగా, అక్రమంగా కేసులు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. రైతులు, వృద్ధులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు, కేసీఆర్ కిట్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
బీజేపీ పదేండ్లలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. దేశంలో 150 మెడికల్ కాలేజీలు, 150 నర్సింగ్ కాలేజీలను మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్క కాలేజీని కూడా కేటాయించలేదని బీజేపీ పనితీరుపై మండిపడ్డారు. జిల్లాకు ఒకటి ఉండాల్సిన నవోదయ పాఠశాల తెలంగాణకు ఒక్కటి కూడా మంజూరు చేయలేదన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పిందని పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ కేవలం ఆరు లక్షల ఉద్యోగాలను కల్పించి చేతులు దులుపుకుందని విమర్శించారు. పదేండ్ల బీజేపీ పాలన, నాలుగు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. పథకాలపై చర్చకు రావాలని కాంగ్రెస్కు సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆరోపించారు. కానీ 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో మార్చి 31వ తేదీన 8వేల మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారని గుర్తుచేశారు. వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్లు అందించాలన్నారు. ఉద్యోగులకు నాలుగు డీఏలను అందించడంతో పాటు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, బెవరేజెస్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్రావు, దశరథ్రెడ్డి, నామ రవికిరణ్గుప్తా, స్రవంతిరెడ్డి, రామకృష్ణారెడ్డి, గుండప్ప, రాజశేఖర్, రవికిరణ్, నర్సింహులు, వెంకటేశం, నారాయణ, యాకూబ్, బండి మోహన్, ఆనంద్, దత్తాత్రి, అశోక్రెడ్డి పాల్గొన్నారు.
అందోల్ నియోజకవర్గంలో ఈనెల 16వ తేదీన నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు కోరారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 20వేల మందికి పైగా తరలి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ నిర్వహించిన చేవెళ్ల, కరీంనగర్ బహిరంగసభలు విజయవంతమయ్యాయన్నారు. జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్, పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని సూచించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అందరినీ మోసం చేసిందని, ఇందుకు పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభిస్తున్నామని మాజీ మంత్రి ప్రకటించడంతో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జై తెలంగాణ నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.