సంగారెడ్డి జూన్ 9 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రంలో పాలన ప్రజలకు చేరువైంది. తెలంగాణ ఆవిర్భావం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన అనంతరం పాలన ప్రజలకు దగ్గర కావడంతోపాటు పరుగులు పెడుతోంది. జిల్లావాసులు ఒకప్పుడు తమ గోడు చెప్పకుందామంటే ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండేవారు కాదు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకునేవి. దళారీ వ్యవస్థ కారణంగా అర్హులైన లబ్ధిదారులకు పథకాలు వర్తించని పరిస్థితి ఉమ్మడి పాలనలో ఉండేది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన తర్వాత పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చారు. వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టుడంతోపాటు పారదర్శకతకు పెద్దపీట వేశారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
కొత్తగా సంగారెడ్డి జిల్లా ఏర్పాటు.. తొమ్మిది రెవెన్యూ మండలాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాలనావికేంద్రీకరణకు ప్రాధాన్యతనిచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కొత్తగా సంగారెడ్డి జిల్లా ఉనికిలోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంగా సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాలతో సంగారెడ్డి జిల్లా ఏర్పడింది. దీంతో అధికారులు మారుమూల ప్రాంతాల్లో పర్యటించి ప్రజాసమస్యలను పరిష్కరించడంతోపాటు ప్రభుత్వకార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలో కొత్తగా జహీరాబాద్, నారాయణఖేడ్, అందోలు-జోగిపేట రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి పాలనలో కొత్త మండలాల కోసం ప్రజలు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు. మంత్రి హరీశ్రావు, నియోజవర్గ ఎమ్మెల్యేలు కొత్త మండలాల ఏర్పాటు డిమాండ్ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎం కేసీఆర్ ప్రజల కోరిక మేరకు సంగారెడ్డి జిల్లాలో కొత్తగా తొమ్మిది మండలాలను ఏర్పాటు చేశారు. కంది, గుమ్మడిదల, అమీన్పూర్, మొగుడంపల్లి, చౌటకూరు, నాగల్గిద్ద, వట్పల్లి, సిర్గాపూర్, నిజాంపేట మండలాలను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు పాలన చేరువైంది. కొత్త మండలాల్లో తహసీల్ కార్యాలయాలతోపాటు మండల పరిషత్ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో అవినీతికి తావులేకుండా పోయింది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గ్రామాల్లో ఊపందుకున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం ప్రభుత్వ కార్యక్రమాలఅమలుతోపాటు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు.
పంచాయతీలుగా తండాలు, కొత్తగా ఐదు మున్సిపాలిటీలు..
కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రజల ఏండ్లనాటి కల. మరీ ముఖ్యంగా తండాలను నూతన పంచాయతీలుగా చేయాలని ఎంతోకాలంగా కోరుతున్నా ఉమ్మడి పాలకులు పట్టించుకోలేదు. ఫలితంగా మారుమూల గ్రామాలు, తండాలు అభివృద్ధికి దూరమయ్యాయి. సీఎం కేసీఆర్ ప్రజల కోరిక మేరకు సంగారెడ్డి జిల్లాలో కొత్త పంచాయతీలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 2014లో 457 పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 647 ఉన్నాయి. సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 190 పంచాయతీలను ఏర్పాటు చేశారు. అందోలు నియోజకవర్గంలో 29, నారాయణఖేడ్లో 88, పటాన్చెరులో 13, సంగారెడ్డిలో 14, జహీరాబాద్లో 31, హత్నూర మండలంలో 15 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 79 తండాలు పంచాయతీలుగా మారాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అత్యధికంగా 48 తండాలు పంచాయతీలుగా మారాయి. తండాలు పంచాయతీలుగా మారడంతో రూపురేఖలే మారిపోయి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా అందోలు-జోగిపేట, అమీన్పూర్, బొల్లారం, తెల్లాపూర్, నారాయణఖేడ్ మున్సిపాలిటీలు ఏర్పాటు అయ్యాయి. కొత్త మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
నూతన మండలంలో ఉజ్వల ప్రగతి
ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో నూతనంగా ఏర్పాటైన నాగల్గిద్ద మండలం ఉజ్వల ప్రగతిని సాధించింది. విద్య, వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నూతన మండలంలో గ్రామాల రూపురేఖలు మారాయి. మనఊరు- మనబడి కింద పాఠశాల బాగుపడింది. ఉమ్మడి మనూర్ మండలం ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోకుండా అనేక బాధలు పడ్డాం. నూతనంగా ఏర్పాటైన మండలంలో అన్ని రకాల మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం ప్రజలకు కల్పించింది. మా మండలం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. ఇన్ని వసతులు కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఇక్కడ ప్రజలు ఎల్లవేళలా రుణపడి ఉంటారు.
– భిమాణా, బీఆర్ఎస్ నాగల్గిద్ద మండల యువనాయకుడు, ఉట్పల్లి