మనోహరాబాద్, మే 17: పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటే, ఐదునెలల కాంగ్రెస్ సర్కారులో అరిగోస పడుతున్నారని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. వడ్లకు బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లిలో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ఆరబోసిన రైతులతో ఆయన ముచ్చటించాడు. అనంతరం పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన, ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అకాల వర్షాలు కురుస్తున్నా, ప్రభుత్వం ప్రత్నామాయ చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు.
సన్న వడ్లు, దొడ్డు వడ్లు అనే తేడాలేకుండా వెంటనే అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలని సర్కారును డిమాండ్ చేశారు. బోనస్ దేవుడెరుగు, ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి మొలకలెత్తే పరిస్థితి నెలకొందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఏ కష్టం రాకుండా కేసీఆర్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 దొంగ హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్రెడ్డి ఒక్క హామీ సరిగ్గా అమలు చేయలేదని వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు.
ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, కేసులు మాకేం కొత్త కాదని ప్రజలకు, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని, మా జోలికి వస్తే ఖబడ్దార్ అని ప్రతాప్రెడ్డి హెచ్చరించారు. దొంగదందాలు, మట్టిమాఫియా, అక్రమ భూ దందాలు చేసే వారే బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారని, నికార్సైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బీఆర్ఎస్కు అండగా ఉన్నారన్నారు.
పోలీసులారా.. మీరూ రైతు బిడ్డలేనని, తాము రైతుల పక్షాన పోరాటం చేస్తున్నామని, రాజకీయం చేయడం లేదని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. స్థానిక పోలీసులు నిరసన చేస్తున్న వారి ఫొటోలు, వీడియోలు తీయడంపై ఆయన ప్రశ్నించారు. మేము, మీరు ఒక్కటేనని, మేము రైతుల పక్షాన పోరాడుతుంటే, మీ ఉన్నతాధికారులు కేసులు చేయమని మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారన్నారు. “మీరు మేము ఒక్కటే పోలీసు అన్నల్లారా..” అంటూ ఆయన పాట పాడారు. ఆందోళనలో ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్, ఎంపీటీసీ లతావెంకటేశ్గౌడ్, తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సతీశ్చారి, నాయకులు పంజా భిక్షపతి, రేణుకుమార్, వెంకటేశ్ యాదవ్, రమేశ్, కృష్ణాగౌడ్, ఉదయ్, మన్నె శ్రీనివాస్, చంద్రారెడ్డి పాల్గొన్నారు.