మెదక్ అర్బన్, అక్టోబర్ 11: ఓటరు నమోదు పెంపునకు ప్రతి గ్రామంలో ఓటర్లను చైతన్యం చేయడానికి సాంస్కృతిక కళాకారులతో కళాజాత కార్యక్రమాలు నిర్వహించాలని మెదక్ ఎన్నికల అధికారి రాజర్షి షా అన్నారు. బుధవారం ఎన్నికల అధికారి కార్యాలయంలో ఎన్నికల నోడల్ అధికారులతో సాధారణ ఎన్నికల్లో 100 శతం ఓటింగ్ పెంచేందుకు 45 రోజుల కార్యాచరణ కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఓటరు చైతన్యం కోసం కళాకారులతో పట్టణ, గ్రామీణ ప్రధాన కూడళ్లలో, ఎక్కువగా జన సమీకరణ ఉన్న ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో ఓటర్ చైతన్యం కొరకు కళాజాత కార్యక్రమాలతోపాటు ఓటరు సంచార చైతన్య రథాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి కళాశాలలో రోజువారీగా స్వీప్ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా నైతికంగా ఓటింగ్ వేసేవిధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పోలింగ్ బూత్ లెవెల్ స్థాయిలో ఎంపీడీవో, ఎంపీపీ, ఏపీఎం, ఏపీఓల పర్యవేక్షించాలన్నారు. పట్టణ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 100 శాతం ఓటింగ్ జరిగేలా అవగాహన కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. సమీక్షలో జిల్లా పరిషత్ సీఈఓ శైలేశ్, డీఈఓ రాధాకృష్ణ, సీపీఓ కృష్ణయ్య, పీడీ డీఆర్డీఏ శ్రీనివాస్ ఉన్నారు.