పాఠశాలల ప్రగతికి పనులు ప్రారంభం
12 రకాల పనులతో మౌలిక వసతులు
సంగారెడ్డి జిల్లాలో 441, మెదక్ జిల్లాలో 313
పాఠశాలలు ఎంపిక
వచ్చే విద్యాసంవత్సరానికి పనులు పూర్తయ్యేలా చర్యలు
ఇంగ్లిష్ బోధన కూడా అందుబాటులోకి..
ప్రభుత్వ బడుల రూపురేఖలు మారనున్నాయి. దశాబ్దాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సర్కార్ స్కూళ్లలో అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. అదనపు తరగతి గదులు, ప్రహరీలు, మరుగుదొడ్లు, డైనింగ్హాళ్లు, ఫర్నిచర్, తాగునీటి సౌకర్యంలాంటి 12 రకాల పనులను చేపట్టనున్నది. ఇందుకు అవసరమైన నిధులను ఆయా పాఠశాలల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 441 పాఠశాలలను ఎంపిక చేయగా, మొదటి విడుతలో 204 బడుల్లో రూ.33.22 కోట్లతో సౌకర్యాలు కల్పించనున్నారు. ఇటీవలే ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో మనఊరు-మనబడిని అధికారికంగా ప్రారంభించగా, పటాన్చెరు, జహీరాబాద్, అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పనులకు శ్రీకారం చుట్టారు. మెదక్ జిల్లాలో 898 స్కూళ్లుండగా, మొదటి విడుతలో 313 గుర్తించారు. వచ్చే విద్యాసంత్సరం ప్రారంభానికల్లా పనులన్నీ పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే, ఆంగ్ల మాధ్యమం అమలు చేసేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేశారు.
సంగారెడ్డి మే 6 (నమస్తే తెలంగాణ)/ మెదక్ మున్సిపాలిటీ: బడుల బాగుకోసం తొలి అడుగులు పడుతున్నాయి. విద్యావిధానంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పాఠశాలల ఎంపికను అధికారులు పూర్తి చేశారు. మెదక్ జిల్లాలో మొత్తం 313 పాఠశాలలు, సంగారెడ్డి జిల్లాలో 441 పాఠశాలలను అధికారులు మౌలిక వసతుల కల్పనకు ఎంపిక చేశారు. దీంతో తొలి విడుత పనులు ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరానికి పూర్తి చేసి నూతనంగా పాఠశాలను అందించే దిశగా పనులు సాగుతున్నాయి. ఇంగ్లిష్ బోధన కూడా అప్పటి నుంచే ప్రారంభంకానున్నది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మన ఊరు-మన బడి కింద సంగారెడ్డి జిల్లాలో 441 పాఠశాలలను అధికారులు ఎంపిక చేశారు. ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలికసదుపాయాలు కల్పించటంతోపాటు విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్ అందుబాటులోకి తీసుకురానున్నారు. కాగా, ఇటీవలే ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని పటాన్చెరు, జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మహిపాల్రెడ్డి, మాణిక్రావు, చంటి క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 441 పాఠశాలలను ఎంపిక చేయగా, మొదటి విడతలో 204 పాఠశాలల్లో పనులు చేపట్టనున్నారు. మలి విడతలో 237 పాఠశాలల్లో మౌలిక వసతులు, ఫర్నిచర్ అందుబాటులోకి తీసుకురానున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి 441 పాఠశాలల్లో పనులు పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. మొదటి విడతలో 204 పాఠశాలల్లో రూ. 33.22,51,101తో 700 పనులు చేపట్టనున్నారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి.
రూ.33.22 కోట్లతో తొలి విడత పనులు
‘మన ఊరు-మన బడి’లో భాగంగా తొలి విడతగా 204 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో 700 పనులను రూ.33.22 కోట్లతో చేపట్టనున్నారు. రూ.3.54 కోట్లతో ఎలక్ట్రిక్ పనులు, రూ.3.15 కోట్లతో తాగునీటి సౌకర్యం, రూ.9.98 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నారు. రూ.1.33 కోట్లతో టాయిలెట్స్ నిర్మాణం, మరమ్మతులు, రూ.4.95 కోట్లతో అవసమైన చోట అదనపు తరగతి గదులు నిర్మించనున్నారు. రూ.96.53 లక్షలతో 20 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీలు, రూ.44.74 లక్షలతో కిచెన్షెడ్లు, రూ.8.82 కోట్లతో డైనింగ్ హాల్స్ నిర్మించనున్నారు. జిల్లాలోని 441 పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
12 రకాల మౌళిక వసతులు..
విద్యాశాఖ ఎంపిక చేసిన పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ‘మన ఊరు-మన బడి’ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్, పెయింటింగ్, మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు, ప్రహరీలు, వంట గది, అదనపు తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డ్రైనింగ్హాల్, డిజిటల్ విద్య అమలుకు అవసరమైన పాఠశాలల్లో చేపట్టనున్నారు.
మెదక్ జిల్లాలో 313 పాఠశాలలు ఎంపిక
మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో 898 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో ప్రాథమిక పాఠశాలలు 128, ప్రాథమికోన్నత పాఠశాలలు 624, ఉన్నత పాఠశాలలు 146 ఉన్నాయి. కాగా, మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద తొలి విడతలో అధికారులు 313 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 44, ప్రాథమికోన్నత పాఠశాలలు 180, ఉన్నత పాఠశాలలు 89 ఉన్నాయి. ఎంపికైన పాఠశాలల్లో పనులను చేపట్టనున్నారు. మొదటి విడతలో ఎంపిక చేసిన 33శాతం పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేయనున్నారు. మరో రెండేండ్లల్లో మిగతా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించనున్నారు. రానున్న విద్యాసంవత్సరంలో మిగతా 585 పాఠశాలలకు సంబధించి ఎంత బడ్జెట్ అవసరమో దానిపై జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనాలను తయారు చేశారు.
ఆంగ్ల బోధనకు ఉపాధ్యాయులు సిద్ధం
మన ఊరు-మనబడిలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్న దృశ్య ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో శిక్షణనిచ్చారు. మెదక్ జిల్లాలో 898 పాఠశాలలు ఉండగా, వీటిలో సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇందుకుగానూ 1,870 మంది ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై శిక్షణను పూర్తి చేశారు. ప్రస్తుతం జిల్లాలో ప్రాథమిక 202, ప్రాథమికోన్నత 52, ఉన్నత 66 పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగుతున్నది. వీటిల్లో 28,801 మంది విద్యార్థులు చదువుతున్నారు.
త్వరగా పనులు పూర్తి చేసేలా చర్యలు
మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా జిల్లాలోని 441 పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నాం. ఇందులో రూ.30 లక్షలలోపు వ్యయం అయ్యే 204 పాఠశాలల్లో తొలి విడతగా పనులు ప్రారంభించటం జరుగుతుంది. మిగితా పాఠశాలల్లో రెండో విడతలో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటినికి ఎంపికైన మొత్తం 441 పాఠశాలల్లో ప్రభుత్వం సూచించిన పనులు పూర్తి చేస్తాం. – రాజేశ్, డీఈవో, సంగారెడ్డి
త్వరలో పనులు ప్రారంభం..
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. తొలి విడుతలో భాగంగా ప్రభుత్వం జిల్లాకు రూ.2 కోట్లు విడుదల చేసింది. ఎంపికైన పాఠశాలలకు అవసరమయ్యే నిధులను ఆయా పాఠశాలల బ్యాంకుల ఖాతాల్లో జమ చేశాం. ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నది.
– రమేశ్కుమార్, మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి