జహీరాబాద్, జనవరి 31: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ శాఖల్లో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. కీలకమైన పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ,రవాణాశాఖల్లో బదిలీలపై జోరుగా ఊహాగనాలు వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారులు అధికార పార్టీ నాయకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నట్లు తెలిసింది. కావాల్సిన పోలీస్స్టేషన్, కావాల్సిన మండలానికి వచ్చేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. పోలీసు శాఖల్లో తమకు కావాల్సిన వారికి పోస్టింగ్లు ఇప్పించేందుకు ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల బదిలీలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని సమాచారం. జహీరాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే లేకపోవడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడంతో అధికారులను మార్చేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, రవాణా శాఖల్లో బదిలీలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.జిల్లాకు చెందిన మంత్రికి బదిలీలకు సంబంధించిన నివేదికను ఇచ్చినట్లు సమాచారం. ఎస్సైలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్, పీఆర్, ఆర్అండ్బీ, చిన్న నీటిపారుదల శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ, వ్యవసాయశాఖ, సర్కారు దవాఖానల్లో వైద్యాధికారుల బదిలీలపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మండల స్థాయి అధికారులు, సిబ్బందిని కొంతమందిని బదిలీ చేయాలని మండల స్థాయి అధికార పార్టీ నాయకులు కోరుతున్నట్లు తెలిసింది. దీంతో అధికారులు కాంగ్రెస్ నాయకులను మచ్చిక చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్ పట్టణం, జహీరాబాద్ రూరల్, చెరాగ్పల్లి, కోహీర్ పోలీస్స్టేషన్లు జహీరాబాద్ పట్టణ సర్కిల్ పరిధిలో ఉన్నాయి. జహీరాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో హద్నూర్, ఝరాసంగం,రాయికోడ్ స్టేషన్ ఉంది. కొన్ని పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న ఎస్సైలను బదిలీ చేసేందుకు అధికార పార్టీ నాయకులు పార్టీ పెద్దలకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. అధికార పార్టీ నాయకులు నియోజకవర్గ అభివృద్ధి పనులు, ప్రణాళికలతో పాటు బదిలీలపై ప్రధానంగా తమకు నచ్చిన ఎస్సైల పేర్లను ప్రతిపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అధికార పార్టీ నాయకుల ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకొని అధికారులను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.జహీరాబాద్ డివిజన్లో పనిచేస్తున్న తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ రాజ్, నీటిపారుదలశాఖ, గ్రామీణ నీటిసరఫరా, రవాణాశాఖల్లో పనిచేస్తున్న అధికారుల జాబితాను సేకరించినట్లు తెలిసింది. డివిజన్, మండల స్థాయి అధికారులు జహీరాబాద్ నియోజకవర్గంలో నాలుగేళ్లకు పైగా విధులు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను బదిలీ చేసేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. డివిజన్లో ఎక్కువకాలం పనిచేసిన అధికారులను బదిలీ చేసేందుకు మంత్రికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మండల స్థాయి అధికారుల బదిలీలు జరుగలేదు. ఈసారి తప్పుకుండా జరిగే అవకాశం ఉందని పలు శాఖల అధికారులు తెలుపుతున్నారు.