జిల్లాలో రుతురాగం పలకరింపు
కురుస్తున్న తేలికపాటి వాన
సాగు పనుల్లో అన్నదాతలు
అందుబాటులో ఎరువులు, విత్తనాలు
వానకాలం సాగు అంచనా 5.63 లక్షల ఎకరాలు
ఇతర పంటల వైపు రైతుల చూపు
పత్తి, ఆయిల్పామ్ సాగుపై దృష్టి
జిల్లాను తొలకరి పలకరించింది. తేలికపాటి వర్షాలు కురుస్తుండడంతో రైతులు వానకాలం సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈసారి వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనగా, దానికి అనుగుణంగా విత్తనాలు విత్తుకోవడానికి రైతులోకం సిద్ధమవుతున్నది. జిల్లాకు సరిపడా విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం ముందస్తుగానే పంపించింది. ఈసారి జిల్లాలో 5.63 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగుకానున్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. 2.50 లక్షల ఎకరాల్లో వరి, 2లక్షల ఎకరాల్లో పత్తి, 50వేల ఎకరాల్లో జొన్నలు, 40వేల ఎకరాల్లో కందులు, 9 ఎకరాల్లో పెసర్లు తదితర పంటలను సాగు చేయనున్నారు. రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని, మరో రెండు వర్షాలు కురిస్తే భూమిలో ఉన్న వేడి తగ్గుతుందని, తర్వాత విత్తనం వేస్తే త్వరగా మొలకెత్తి మంచి దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
సిద్దిపేట, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తొలకరి పలకరించింది. జిల్లావ్యాప్తంగా రైతులు వానకాలం సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈసారి వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా రైతులు విత్తనాలు విత్తుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా జిల్లాకు సరిపడా విత్తనాలు, ఎరువులను సిద్ధంగా ఉంచింది. బ్లాక్లో విత్తనాలు అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. ఆయా మండలాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వర్షాలకు రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. నల్లరేగడి భూము ల్లో దుక్కులను సిద్ధం చేసి కొన్ని ప్రాంతాల్లో రోహిణి చివరి పాదంలోనే పత్తి విత్తనాలు వేశారు. జిల్లాలో ప్రధానంగా వరి పంటతో పాటు మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, కంది, నువ్వులు తదితర పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తారు. పంట మార్పిడి విధానాన్ని తప్పనిసరి చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తు న్నారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు తొందరపడి విత్తనాలు వేయవద్దని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు. మరో రెండు వర్షాలు కురిస్తే భూమిలో ఉన్న వేడిమి తగ్గుతున్నదని, తద్వారా విత్తనం వేస్తే త్వరితగతిన మొలకెత్తి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని చెపుతున్నారు.
వానకాలం సాగు ఇలా..
వానకాలం సాగు జిల్లా రైతులు సన్నద్ధమయ్యారు. ప్రభు త్వం రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలతోపాటు పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. రైతాంగాన్ని అన్ని రకాలుగా దన్నుగా నిలుస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 9,12,947 ఎకరాల భూమి ఉంది. ఇందులో అటవీ భూమి 52,380 ఎకరాలు కాగా, సాగుకు యో గ్యం కానిది 44,152 ఎకరాలు ఉంది. సాగు యోగ్యమైనది 7,01,902 ఎకరాలు ఉండగా, సరాసరిగా 5,63,005 ఎకరాలు సాగు అవుతున్నది. ఈసారి వానకాలం (2022-23)లో జిల్లాలో 2,50,000 ఎకరాల్లో వరి సాగు చేస్తారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఇందుకు విత్తనాలు 62,500 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయి. 12,500 టీఎస్ఎస్ఐడీసీ, రైతులు 6,250 క్వింటాళ్లు, ప్రైవేట్గా 43,750 కొనుగోలు చేశారు. పత్తిసాగు 2 లక్షల ఎకరాల్లో సాగుకు గాను 1800 క్వింటాళ్లు, కందులు 40వేల ఎకరాలు 1600 క్వింటాళ్లు, మక్కజొన్న 50 వేల ఎకరాలు, పెసర్లు 9 ఎకరాలు తదితర పంటలను సాగు చేయనున్నారు. ఇందుకు అవసరమైన సీడ్స్ను వ్యవసాయశాఖ అధికారులు ఆయా మండలాల్లో సిద్ధం చేస్తున్నారు. జీలుగ, జనుము విత్తనాలను రైతులకు అందిస్తున్నారు. జిల్లాకు 49,888 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 16,553 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. డీఏపీ 26,440 మెట్రిక్ టన్నులకు గాను 1891 మెట్రిక్ టన్ను లు, ఎంఓపీ 8277 మెట్రిక్ టన్నులకు గాను 440 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 51,884 మెట్రిక్ టన్నులకు గాను 12,957 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది.
మొక్కజొన్న
జిల్లాలో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తారు. వానకాలం సాగుచేసే ఈ పంటకు ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్న ఆహార పంటనే గాక దాణా రూపంలో పశువులకు మేత, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా తదితర వాటికి ఉపయోగిస్తుంటారు. అత్యధికంగా వానకాలంలో సాగు చేస్తారు. రెండో పంటగా యాసంగి సమయంలో మొక్కజొన్న వేస్తారు. జూన్ మొదటి వారం నుంచి మాసం చివరి వరకు సాగు చేస్తుంటారు. రేగడి, ఎర్రనేలలు, లోతైన మధ్య రకపు రేగడి నేలలు అనుకూలం. నీరు నిల్వ ఉంచుకునే శక్తిగల నేలలకు ప్రత్యేకం. దీంట్లో ప్రధానంగా గుర్తింపు పొందిన కంపెనీ విత్తనాలను రైతులు వాడాలి. తద్వారా విత్తన శుద్ధిని చేయాల్సిన అవసరం ఉండదు. విత్తనాలు వేసే ముందు భూమిని రెండు మూడుసార్లు కలియ దున్నాలి. వీలైనంతగా పశువుల ఎరువును, సేంద్రియ ఎరువులను వాడాలి.
పత్తి
మన ప్రాంతంలో మొక్కజొన్నతో పాటు పత్తి పంటను సాగు చేస్తుంటారు. నల్లరేగడి ప్రాంతాల్లో ఎక్కువగా దిగుబడి రావడానికి అవకాశం ఉం టుంది. పత్తి పైరు ఎక్కువ నీటిని తట్టు కోలేదు. అధికంగా నీరు పెట్టరాదు. భూమిలో తేమ ను బట్టి నీటిని వదలాల్సిన అవసరం ఉంటుంది. వివిధ క్రిమికీటకాలను తట్టుకోవడానికి బీటీ ప్రత్తి విత్తనాలు మార్కెట్లోకి వచ్చాయి. పత్తిని ఆశించే కాయతొలుచు పురుగులో అత్యంత ప్రమాదకరమైన శనగపచ్చ పురుగులను తట్టుకునే వంగడాలు తదితర వాటిని నిరోధించడంలో బీటీ విత్తనాలు ఉపయోగపడుతాయి. పంటను రైతు రెండు రకాలుగా వేస్తుంటారు. చతురస్రాకారం, డబ్బా, సాలు పద్ధతిలో వేస్తుంటారు. వివిధ దేశాలకు చెందిన కంపెనీలు మోనోశాంటో, మైకో, రోహిణి, బన్ని, రాశి, సుమ, బోల్గార్డ్, తులసి తదితర వాటిని వేస్తుంటారు. అన్ని ప్రాంతాల్లో భాస్వరం ఎరువులు ఒకేసారి ఆకరి దుక్కిలో వేసి కలియదున్నాలి. నత్రజని, పొటాష్ను మూడు సమభాగాలుగా చేసి విత్తనం విత్తిన 30-60-90 రోజులకు మొక్క మొదళ్లకు 7 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వేయాలి.
నువ్వులు
నువ్వుల సాగును రైతులు ఎక్కువగా చేస్తుంటారు. జూన్ మొదటి వారం నుంచి సాగు చేస్తుంటారు. పంట 3 నెలల్లో కోతకు వస్తుంది. నీరు నిలిచే ఆమ్ల, క్షార గుణాలు గల నేలలు పంటకు పనికి రావు. విత్తనం విత్తేముందు నేలను 2-4 సార్లు మెత్తగా దున్నాలి. అనంతరం విత్తనాన్ని విత్తాలి. ఎకరాకు రెండున్నర కిలోల నువ్వులు, మూడింతల ఇసుకను కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి.
కంది
కంది పంట వానకాలం, యాసంగి సమయాల్లో వేస్తుంటారు. పత్తి, మొక్కజొన్న, వేరుశనగ తదితర పంటల్లో అంతర పంటగా కందిని సాగు చేస్తారు. పప్పు ధాన్యాల్లో అధికంగా పండించే ఈ కందిని వర్షాధారంగా సాగు చేస్తుంటారు. వివిధ కారణాలతో తొలకరిలో ఏ పంట వేసుకునేందుకు అవకాశంలేని సమయంలో రెండో పంటగా కందిని సెప్టెంబర్, అక్టోబర్ కాలంలో వేస్తుంటారు.
ఇతర పంటల సాగు వైపు రైతులు
ప్రభుత్వం ఇతర పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. సన్నరకం వరితో పాటు పత్తి, కంది తదితర పంటలను ఎక్కువగా సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నది. జిల్లాలో గతేడాది నుంచి ఆయిల్పామ్ను సాగు చేస్తున్నారు. నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్పామ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నది. పరిశ్రమ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నది. దీంతో పాటు పట్టు పరిశ్రమను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలో చాలాచోట్ల పట్టు పురుగుల పెంపకాన్ని రైతులు చేపడుతున్నారు. మల్బరీ సాగుకు ఇప్పుడిప్పుడే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ పంటలో మంచి లాభాలు ఉండడంతో రైతులు ఆ దిశగా ముందుకెళ్తున్నారు. గతేడాది నుంచి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో రైతులు సాగు చేస్తున్నారు. కూరగాయల సాగుతో రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సహకారం అందిస్తున్నది. వరిలో వెదజల్లే పద్ధతిని అవలంబిస్తున్నారు.
ఆయిల్పామ్ సాగుతో లాభాలు