సిద్దిపేట, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన వడగండ్ల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. అకస్మాత్తుగా కురిసిన వడగండ్ల వల్ల పంటలు దెబ్బతిని రైతులు బాధలో ఉన్నారని, వెంటనే మున్సిపల్, రెవెన్యూ అధికారులు స్పందించి పంటనష్టాన్ని అంచనావేసి రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా ప్రజల్లోకి వెళ్లి నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పాలని సూచించారు. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి సిద్దిపేట మున్సిపల్, రెవెన్యూ అధికారులు, బీఆర్ఎస్ శ్రేణులతో ఆయన టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. రాళ్ల వాన కురవడంతో జరిగిన నష్టంపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కూలిన ఇండ్లు, రాలిన మామిడి పంటలు, నేలకొరిగిన మొక్కజొన్న, వరి పంటలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
సిద్దిపేట పట్టణంలో విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలని, కూలిన స్తంభాల వద్ద మరమ్మతులు చేపట్టాలన్నారు. కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటించి ప్రజావసరాలను గుర్తించి అందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. పూర్తిగా కూలిపోయిన ఇండ్లకు రూ.లక్ష సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్వాసితులైతే వారికి బస, భోజనం ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. రూరల్ మండలంలోని పుల్లూరు, వెంకటాపూర్, బుస్పాపూర్, తడకపల్లి, చిన్నకోడూరు మండలంలోని పెద్దకోడూరు, చంద్లాపూర్, చౌడారం తదితర గ్రామాల్లో పంట నష్టం తీవ్రంగా ఉన్నదని, వెంటనే వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవన శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు నష్టపోయిన పంటలు, తోటలను పరిశీలించి నష్టం అంచనాలు ప్రభుత్వానికి పంపాలన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు వెంటనే పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.