చిలిపిచెడ్, మే 28: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనాలని, తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ గురువారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల రైతులు చిట్కుల్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద మెదక్-జోగిపేట రోడ్డు పెద్దఎత్తున ధర్నా చేశారు. చిట్కుల్ చాముండేశ్వరీ రైస్మిల్కు ట్రాక్టర్లలో తెచ్చినా ధాన్యం వర్షానికి తడిసిందని, తడిసిన ధాన్యం వేరే రైస్మిల్కు తీసుకుపోవాలని అక్కడ ఉన్న రెవెన్యూ జీపీవోలు రైతులకు చెప్పారు.
దీంతో రైతులంతా కలిసి మెదక్-జోగిపేట రోడ్డుపై రెండు గంటల పాటు ధర్నాకు దిగారు. ఎస్సై నర్సింహులు, సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని తహసీల్దార్, డీఎంకు ఫోన్లో మాట్లాడి రైతులను సముదాయించారు. ట్రాక్టర్లో ఉన్న ధాన్యాన్ని ఖాళీ చేసే వరకు రోడ్డుపై నుంచి జరిగేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. సీఎం డౌన్ డౌన్.. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన.. కలెక్టర్, తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున రైతులు నినాదాలు చేశారు.తహసీల్దార్,డీఎంతో ఎస్సై నర్సింహులు ఫోన్లో మాట్లాడి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.