కొల్చారం, జూన్ 9: ధాన్యం రంగుమారిందని అన్లోడింగ్కు నిరాకరించడంతో రైతులు పెట్రోల్ డబ్బాలతో తహసీల్దార్ కార్యాలయంలో నిరసనకు దిగిన ఘటన మెదక్ జిల్లా కొల్చారంలో చోటుచేసుకుంది. మండలంలోని సంగాయిపేటలో ఎఫ్పీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం నుంచి గత నెల 27న రైతులు మ్యాతరి యాదయ్య, జంగిడి యాదయ్యతో పాటు మరో ఆరుగురు రైతుల ధాన్యం తూకం వేసి 665 బస్తాల ధాన్యం లారీలో వరిగుంతంలోని ఎఫ్ఎంపీ గోదాముకు తరలించారు. అక్కడ అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా లేక సుమారు 15 రోజులు లారీని వేయిటింగ్లో ఉంచారు.
తీరా రెండు రోజుల క్రితం అన్లోడింగ్ చేసేటప్పుడు 40 బస్తాల ధాన్యం అన్లోడ్ చేశాక ధాన్యం రంగు మారిందని దిగుమతి చేసుకోవడానికి నిరాకరించారు. దీంతో రైతులు రెవెన్యూ అధికారులను కలిశారు. తహసీల్దార్ కలగజేసుకుని రంగు మారిన వడ్లను కౌడిపల్లి మండలంలోని ముండ్రాయిలోని శ్రీనివాస పారా బాయిల్డ్ మిల్లుకు పం పిస్తే అక్కడ వెంటనే నూర్పిడి చేస్తారని, అక్కడ తాను ఖాళీ చేయిస్తానని రైతులకు నచ్చజెప్పారు.
తీరా అక్కడికి వెళ్లిన తర్వాత మిల్లర్ అన్లోడింగ్కు నిరాకరించి లారీని లోనికి అనుమతించలేదు. దీంతో ఆవేదన చెందిన రైతులు పెట్రోల్ డబ్బాలు పట్టుకుని కొల్చారం తహసీల్ కార్యాలయం చేరుకుని లారీలు ఖాళీ చేయిస్తారా, పెట్రోల్ పోసుకుని చనిపోవాలా అంటూ నిలదీశారు. ఈ క్రమంలో తహసీల్దార్ కార్యాలయంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే తహసీల్దార్ కలగజేసుకుని రైతులను ఓదార్చారు. లారీలను ఖాళీ చేయించే బాధ్యత తనదేనని చెప్పడంతో రైతులు శాంతించారు. ఈ విషయమై తహసీల్దార్ శ్రీనివాస్చారి మాట్లాడుతూ… మండలంలో కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉందన్నారు. సంగాయిపేట, చిన్నఘనపూర్, అంసానిపల్లి గ్రామాల్లో కొంచెం ధాన్యం మిగిలి ఉందన్నారు. త్వరలోనే చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని రైతు లు ఎవరూ అధైర్యపడొద్దన్నారు.
రెండు వందల బస్తాల ధాన్యం 15 రోజుల క్రితం తూకం వేసి పంపించాం. లారీలో మొత్తం 600లకు పైగా ధాన్యం బస్తాలు ఉన్నాయి. ఇప్పుడు రంగు మారిందని దించుకోము అంటుర్రు. ఆ వడ్లు మేము ఏంచేసుకోవాలి. ఇంకా వడ్లు అమ్ముడు కాలేదు. అటు కాలం ముంచుకొచ్చింది. ఇప్పుడు పెట్టుబడికి ఏంచేయాలి. అందరూ తూకాలు పోస్తుంటే మేము కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం. అధికారులు స్పందించి బేషరతుగా మా వడ్లు దింపుకోవాలి.
– జంగిడి యాదయ్య, రైతు, సంగాయిపేట (మెదక్ జిల్లా)