పాపన్నపేట, మే 18: ధాన్యం రవాణా నిలిచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని మిన్పూర్ రైతులు సోమవారం మెదక్-బొడ్మట్పల్లి రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్గౌడ్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సకాలంలో లారీలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ధాన్యం తడిసిపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వెంటనే ఎస్సై, తహసీల్దార్, ఇతర అధికారులతో మాట్లాడి సకాలంలో లారీలు పంపే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఏఎస్సై, పోలీసులు, రైతులు పాల్గొన్నారు.