వేల ఎకరాల్లో పంట నష్టం..
మెదక్ జిల్లాలో 9966 మంది రైతులకు చెందిన 13,858 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఇందులో వరి 13,632 ఎకరాలు, మామిడి 204 ఎకరాల్లో నష్టం జరిగిందని గుర్తించారు. సంగారెడ్డి జిల్లాలో 316 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మామిడి పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.
సంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి వాన దంచికొట్టింది. రామచంద్రాపురంలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రామచంద్రాపురం, పటాన్చెరు, అమీన్పూర్లో జనజీవనం స్తంభించింది. జాతీయ రహదారి 65పై పలుచోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంట నష్టం వివరాలు సేకరిస్తున్నారు. మెదక్ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సరాసరి 672.6 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా చేగుంట మండలంలో 59.7 మి.మీ కురిసింది. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కూచన్పల్లి, లక్ష్మీనగర్, తొనిగండ్ల గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, బాధిత రైతులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసానిచ్చారు.
– సంగారెడ్డి/ మెదక్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ)
మెదక్ రూరల్/ హవేళీఘనపూర్/ చిన్నశంకరంపేట, ఏప్రిల్ 26 : మెదక్ మండలంలో మంగళవారం భారీవర్షం కురువడంతో పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి, ఖాజీపల్లి గ్రామంలో ఏవో శ్రీనివాస్ పర్యటించి, పంటనష్టం పరిశీలించారు. ఏఈవోలు రాజశేఖర్, శేఖర్, భార్గవి గ్రామాల్లో పర్య టించి, రైతులతో మాట్లాడి పంటలను పరిశీలించారు.
ఈదురుగాలులు, వడగండ్ల వాన
హవేళీఘనపూర్ మండలంలోని బూర్గుపల్లి, కూచన్పల్లి, సర్దనతోపాటు ఆయా గ్రామాల్లో మంగళవారం రాత్రి వడగండ్ల వాన, ఈదురుగాలులతో ధాన్యం నేలరాలింది. హవేళీఘనపూర్ శివారులో చెట్లు కూలాయి. గ్రామాల్లో వ్యవసాయ అధికారులు పర్యటించి, పంట నష్టాన్ని పరిశీలిస్తున్నారు.
నేలరాలిన ధ్యానం.. కూలిన కరెంట్ స్తంభాలు
చిన్నశంకరంపేట మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. చేతికొచ్చిన పంట నేలపాలయింది. ఆరబెట్టిన ధాన్యం తడిసింది. వరి మెదల్లోకి వర్షపు నీరు చేరింది. కరెంటు స్తంభా లు నేలకొరిగాయి. చెట్లు విరిగిపోయాయి. మండలంలో 40కి పైగా కరెంట్ స్తంభాలు విరిగాయి. ట్రాన్స్కో అధికారులు మరమ్మతులు నిర్వహించి బుధవారం కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. గాలివానకు ఇంటి పైకప్పు రేకులు ధ్వంసమ య్యాయి. వ్యవసాయాధికారులు పంట నష్టం వివరాలు సేకరించారు. మండలంలో 358 మంది రైతులకు చెందిన 431 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. అకాల వర్షంతో పంట నేలపాలవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
అకాల వర్షానికి పంట నష్టం
నర్సాపూర్/ చిలిపిచెడ్/ కొల్చారం/ వెల్దుర్తి/ నిజాంపేట/ చేగుంట, ఏప్రిల్ 26 : నర్సాపూర్ మండలంలోని తిర్మలాపూర్, ఖాజీపేట్, చిప్పల్తుర్తి గ్రామాల్లో అకాల వర్షాలకు వరి పంటలు దెబ్బతిన్నాయి. ఏడీఏ సురేఖ స్థానిక వ్యవసాయా ధికారులతో కలిసి పంట నష్టం వివరాలు సేకరించారు.
చిలిపిచెడ్లో 5.6మీ.మీ వర్షపాతం
చిలిపిచెడ్ మండలంలోని ఫైజాబాద్, బండపోతుగల్, అజ్జమర్రి, చండూర్ తదితర గ్రామాల్లో అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. చిలిపిచెడ్ మండలంలో 5.6మీ.మీ వర్షపాతం నమోదైంది. ఏఈవో భూపాల్ పంట నష్టం పరిశీలించారు.
550 ఎకరాల్లో పంటనష్టం : ఏవో శ్వేతకుమారి
కొల్చారం మండల వ్యాప్తంగా సుమారుగా 550 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయాధికారి శ్వేతకుమారి తెలిపారు. రంగంపేట, సంగాయిపేట, పైతర గ్రామాల్లో ఎక్కువగా వరిపంటకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వ్యవసాయ విస్తీర్ణ అధికారులు గ్రామాల్లో పర్యటించి, పంటనష్టం అంచనాలను సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
తడిసిన ధాన్యం.. రాలిన మామిడి
వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం తడవగా, పంటలకు నష్టం వాటిల్లింది. వెల్దుర్తిలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం రాశులను తహసీల్దార్ నాగవర్ధన్ పరిశీలించారు. ఏఈవోలు పలు గ్రామాల్లో పర్యటించి, రాలిన వరి ధాన్యం పరిశీలించారు. మాసాయిపేట మండలంలో పలు గ్రామాల్లో పంటనష్టం జరినట్లు మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ తెలిపారు. నాగ్సాన్పల్లితో పాటు పలు గ్రామాల్లో వరిపంటలను ఏఈవో రజిత, ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భం గా ఏవో రాజశేఖర్ మాట్లాడుతూ.. 148 మంది రైతులకు చెందిన 128 ఎకరాల్లో వరిపంట, 22 మంది రైతులకు చెందిన 38 ఎకరాల్లో మామిడి కాయలు రాలినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. రైతులు ఆందోళన పడవద్దని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.
575 ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట
నిజాంపేట మండలంలో అకాల వర్షాలు అన్నదాతకు అపార నష్టం మిగిల్చింది. నస్కల్ గ్రామంలో ఏవో సతీశ్, డిప్యూటీ తహసీల్దార్ గంగాప్రసాద్, ఎంపీపీ సిద్ధిరాములు పర్యటించి, దెబ్బదిన్న వరి పంటలను పరిశీలించారు. మండ ల వ్యాప్తంగా 450 మంది రైతులకు సంబంధించిన 575 ఎకరాల్లో వరి, 11 మంది రైతులకు చెందిన 39 ఎకరాల్లో మా మిడి పంటలు దెబ్బతిన్నట్లు వివరించారు. పంట నష్టం నివేదికను జిల్లాస్థాయి అధికారులకు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు గణేశ్కుమార్, రాజు ఉన్నారు.
వడగండ్ల వాన.. నేలరాలిన ధాన్యం
చేగుంట మండలంలో వడగండ్ల వానకు పొలాల్లో వరి ధాన్యం నేలరాలింది. మక్కరాజిపేటలోని రైతువేదిక పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఇబ్రహీంపూర్, పులిమామిడి గ్రా మాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటల ను వ్యవసాయాధికారులు పరిశీలించారు.
పంట నష్టం వివరాలు సేకరిస్తున్నాం…
* రామాయంపేట ఏడీఏ వసంత సుగుణ
చేగుంట, ఏప్రిల్ 26 : రామాయంపేట డివిజన్ పరిధిలోని దెబ్బతిన్న పంటలను పరిశీలించి, పంట నష్టం వివరాలను నమోదు చేస్తున్నట్లు రామాయంపేట ఏడీఏ వసంతసుగుణ తెలిపారు. చేగుంట మండలంలోని ఇబ్రహీంపూర్ తదితర గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న వరి పొలాలను సందర్శించా రు. ఈ సందర్భంగా వసంతసుగుణ మాట్లాడుతూ.. చేగుంట మండలంలో సుమారు 3287 ఎకరాల్లో వరి పంట, 9ఎకరాల్లో మొక్కజొన్న పంటల దెబ్బతిన్నట్లుగా అంచన వేశారు. పంట నష్టం వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తా మని ఏడీఏ వసంత సుగుణ తెలిపారు. కార్యక్రమంలో ఏవో హరిప్రసాద్, ఏఈవో అశోక్రెడ్డి, సర్పంచ్ రాములు, రైతులు స్వామి, కిరణ్, మల్లేశ్, సత్తయ్య, ఆంజనేయులు ఉన్నారు.