సదాశివపేట, జూన్ 7: ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అనడం సరికాదని, తాము సంతోషంగా ఉండాలంటే తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన భూ రిజిస్ట్రేషన్ పోర్టల్ను కొనసాగించాల్సిందేనని సదాశివపేట మండల రైతులు రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఎదుట తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మంత్రి హరీశ్రావు బుధవారం సంగారెడ్డి నుంచి మునిపల్లి మండలం చిన్నచల్మెడ గ్రామంలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించేందుకు వెళ్తూ సదాశివపేట తహసీల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అకస్మాత్తుగా మంత్రి హరీశ్రావు తహసీల్ కార్యాలయంలోకి రావడంతో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. మంత్రి నేరుగా తహసీల్దార్ చక్రవర్తి చాంబర్లోకి వెళ్లి ధరణి పోర్టల్ ద్వారా జరుగుతున్న రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన పలువురు రైతులతో మాట్లాడారు. ధరణి బాగుందని, భూమి రిజిస్ట్రేషన్లు సులభంగా అవుతున్నాయని, ధరణి కొనసాగించాలని రైతులు ఈ సందర్భంగా మంత్రితో చెప్పారు.
భూముల రిజిస్ట్రేషన్ల కోసం అప్పట్ల అనేక తిప్పలు పడేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. భూమి అమ్మాలన్నా, కొనాలన్నా ఊళ్లో ఉన్న వీఆర్వో నుంచి మొదలు పెట్టి గిర్ధ్ధావరి, ఎమ్మార్వో, రిజిస్ట్రేషన్ ఆఫీస్, టైటిల్ డీడ్ కోసం ఆర్డీవో ఆఫీస్ల చుట్టూ చెప్పులరిగేలా తిరిగేవాళ్లమని, భూముల రిజిస్ట్రేషన్ల కోసం చేతుల నుంచి పైసల్ ఖర్చయ్యేవని తెలిపారు. రిజిస్ట్రేషన్ అయినాక కూడా మ్యుటేషన్ పూర్తికాకపోతే భూమి మాది కానట్టే ఉండేదని, మ్యుటేషన్ కోసం మళ్లీ తిప్పలు పడాల్సివచ్చేదని చెప్పారు. సీఎం కేసీఆర్ ధరణి తెచ్చాక మా తిప్పలు తప్పాయని, కశీరు చుట్టూ తిరిగే పని తప్పిందని, ధరణితో 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లు పూర్తి అవుతున్నాయని సంతోషంగా తెలిపారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్లు, ఫౌతీ, మార్టిగేజ్ రిలీజ్ చేసుకున్న పలువురు రైతులకు మంత్రి హరీశ్రావు పత్రాలు అందజేశారు. మంత్రి హరీశ్రావు వెంట కలెక్టర్ శరత్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ తదితరులు ఉన్నారు.