రామాయంపేట రూరల్, డిసెంబర్ 2: రైతుల ఆలోచనా విధానాలు రోజురోజుకు మారుతున్నాయి. ఒకప్పుడు వరి, మొక్కజొన్న పంటలు మాత్రమే పండించేవారు. ఒకే రకమైన పంటలు వేయడంతో మార్కెట్లో వాటి ధరలపై అంత ప్రభావం చూపేవి కావు. తెలంగాణ ఏర్పడిన తరువాత వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యామ్నాయ పంటలతో పాటు లాభదాయక పంటలపై రైతులకు రైతు వేదికల్లో అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రైతుల ఆలోచనల విధానాలు పూర్తిగా మారాయి. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో పంటలు పండించేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రామాయంపేట మండలంలోని చాలా గ్రామాల్లో కూరగాయల సాగు అధికంగా పెరిగింది. రైతులు ఒకే రకమైన పంటలు వేయడం దాదాపు తగ్గించారు. తమకున్న తక్కువ భూమిలోనైనా సరే వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తూ గ్రామాల్లో జరిగే వారాంతపు సంతలకు తరలించి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలకు మంచి డిమాండ్ ఉండడంతో వాటి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకే రకమైన పంటలు తగ్గడంతో వాటి డిమాండ్ పెరిగి పంటలకు గిట్టుబాటు ధర ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. కూరగాయల సాగుకు రైతులకు ఇతర పంటల కంటే తక్కువ పెట్టుబడితోపాటు తక్కువ నీటి వినియోగం ఉంటుంది. డ్రిప్పుల ద్వారా కూరగాయాలకు నీరు పెడుతూ సాగు చేస్తున్నారు. రైతులు లాభాలు బాటలో పయనిస్తున్నారు.
నేను రెండెకరాల్లో కూరగాయలు సాగు చేశా. టమాట, వంకాయ, పచ్చిమిర్చి, కాకర కాయ, బీరకాయ కూరగాయలు వేశాను. వీటికి డ్రిప్పు సహాయంతో నీరు అందిస్తున్నా. ఐదేండ్లుగా కూరగాయాలు సాగు చేస్తున్నా. పండించిన కూరగాయలను ఆటోలో తరలించి అమ్ముతున్నా. దీంతో రోజూ డబ్బులు వస్తున్నాయి. ఇంట్లో ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఎంతో ఉపయోగపడుతున్నాయి. మార్కెట్లో కూడా కూరగాయల మంచి డిమాండ్ ఉంది. ఇతర పంటల కంటే కూరగాయలతోనే ఆదాయం ఎక్కువ.
కూరగాయల సాగుతో మంచి ఆదాయం ఉంది. రెండేండ్లుగా కూరగాయలు పండిస్తున్నా. గతంలో పండించిన కూరగాయలు అమ్మాలంటే రామాయంపేట పట్టణానికి వారానికోసారి వెళ్లాలి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో సంతలు నిర్వహిస్తున్నారు. దీంతో రోజుకో గ్రామంలో వారాంతపు సంతలో కూరగాయలు విక్రయించుకుంటున్నా. దీంతో రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. మంచి రేట్లు కూడా వస్తున్నాయి. రైతులకు కూరగాయల సాగుపై అవగాహన ఉంటే ఇతర పంటల కంటే ఎక్కువ ఆదాయం పొందవచ్చు.