నిజాంపేట, సెప్టెంబర్ 19: యూరియా (Urea) కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. సరైన సమయంలో యూరియా అందక సాగు చేస్తున్న పంట పొలాలు ఎరుపెక్కుతున్నాయి. సరిపడా యూరియా సరఫరా కాక రైతులు ఒకరోజు ముందుగానే క్యూ లైన్లో నిలుచున్న ఘటన నిజాంపేట మండలంలోని నస్కల్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. నస్కల్లోని రైతు వేదికకు గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో 500 యూరియా సంచులతో లారీ వచ్చింది. సమాచారాన్ని తెలుసుకున్న రైతులు రైతు వేదికకు చేరుకొని యూరియా దొరుకుతుందో లేదో అనే భయంతో రాత్రి అక్కడే బస చేశారు. మరి కొంతమంది రైతులు శుక్రవారం ఉదయం రైతు వేదికకు చేరుకోవడంతో భారీ క్యూలైన్ ఏర్పడింది.