సిద్దిపేట.మే 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం సీజన్కు ముందే జనుము, జీలుగ, పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానకాలం సాగుకు సమాయత్తం అవుతున్న తరుణంలో విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై రైతులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనాల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఉన్న ఆగ్రోస్ వద్ద రైతులు బారులుదీరి కనిపిస్తున్నారు.
క్యూలో చెప్పులు, ఇతర సంచులు పెడుతున్నారు. అరకొర విత్తనాలను ప్రభుత్వం సరఫరా చేస్తున్నా రైతులకు అందడం లేదు. రోహిణి కార్తె చివరి పాదం లేదా వచ్చే కార్తెలో వరినార్లు పోస్తారు. నార్లు ఎదిగే లోపల జీలుగ, జనుము, పచ్చరొట్ట విత్తనాలను విత్తుతారు. ఈ విత్తనాలను ప్రధానంగా ఆగ్రోస్ రైతు సేవాకేంద్రాలు, ప్రాధమిక వ్యవసాయ సహకార కేంద్రాల్లో విక్రయాలు చేస్తున్నారు. జీలుగ 30 కిలోల బస్తాకు రూ.2,790 కాగా రూ.1,674 సబ్సిడీపోనూ రూ1,116 రైతు చెల్లించాలి. జనుము 40 కిలోల బస్తాకు రూ.3,620 కాగా రూ.2,172 సబ్సిడీపోనూ రూ.1,448 చెల్లిస్తాడు. పిల్లి పెసర 20 కిలోల బస్తాకు రూ.2,710 కాగా రూ.1,626 సబ్సిడీపోనూ రైతు రూ. 1,084 చెల్లిస్తున్నాడు.
ఉమ్మడి జిల్లాలోని రైతాంగానికి సరిపడా పచ్చిరొట్ట, జీలుగ, జనుము విత్తనాలు అందించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేసీఆర్ సర్కార్ సకాలంలో విత్తనాలను రైతులకు అందుబాటులో పెట్టింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విత్తనాలను అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో డిమాండ్కు తగ్గట్లు విత్తనాలు అందుబాటులో ఉంచాలన్న కనీస ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. వ్యవసాయ శాఖపై సాగు ప్రణాళిక, విత్తనాలు, ఎరువులు తదితర అంశాలపై జిల్లాకు చెందిన మంత్రులు రివ్యూలు కూడా చేయలేదు. వానకాలంలో వరిని ఉమ్మడి జిల్లాలో 7,77,113 ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనా ఉంది. ఇందుకు తగ్గట్లుగా జీలుగ, జనుము, పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో పెట్టి రైతులకు అందించాలి.
పంట వేసే ముందు రైతులు పొలాల్లో జీలుగ, జనుము, పచ్చిరొట్ట విత్తనాలు నాటుతారు. ఏపుగా పెరిగిన వాటిని కలియదున్నితే నేల సారవంతమవుతుంది. పంటకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గి జీవ ఎరువులుగా ఉపయోగపడే ఈ విత్తనాలపై కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పించడంతో రైతుల్లో చైతన్యం వచ్చింది. అప్పటి ప్రభుత్వం ముందుచూపుగా సకాలంలో అన్ని ఆగ్రో సెంటర్ల ద్వారా రైతులకు సబ్సిడీపై అందించింది.
దీంతో రైతులు సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలు సాధించారు. ఐదారేండ్లుగా రైతులు పొలాల్లో వానకాలం సాగుకు ముందు పచ్చిరొట్ట, జీలుగ, జనుము విత్తనాలు విత్తుతున్నారు. దానిని పొలంలో కలియ దున్నడం వల్ల అవి కుళ్లి నేలకు అత్యధిక పరిమాణాల్లో పోషకాలు అందుతాయి. పొలంలో కలియ దున్నడం వల్ల నత్రజని పెరగడంతో పాటు నేలకు సత్తువ వస్తుంది.
మొక్కలు వృద్ధి చెంది నేల అట్టడుగు పొరల నుంచి పోషకాలను సంగ్రహించగలుతాయి. యూరియా వినియోగం తగ్గుతుంది. చెరువు మట్టి, పశువుల పేడ, కోళ్ల ఎరువు తదితర వాటి కన్న పదిరెట్లు ఎక్కువగా పచ్చిరొట్ట భూములను సారం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అందుబాటులో విత్తనాలను పెట్టలేదు. కాలం నెత్తిమీదికి వచ్చింది. ఎప్పడు ఈ ప్రభుత్వం విత్తనాలు అందిస్తుంది. ఎప్పడు సాగు చేస్తాం అంటూ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
జీలుగ విత్తనాల కోసం పదిహేను రోజుల నుంచి ఎదురుచూస్తున్నాం. అక్కన్నపేటలోని ఆగ్రో రైతు సేవాకేంద్రం చుట్టూ రోజూ తిరుగుతున్నాం. రేపు, మాపంటూ తిప్పుతున్నారు. ఎప్పుడు వస్తాయో, రావో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఆలస్యంగా జీలుగ చల్లితే తీరా వానకాలం నాట్లు వేసే సరికి పెరగకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అసలు గీ సర్కారులో రైతులను పట్టించుకునేటోళ్లు కరువయ్యారు. – మంకిడి రవీందర్, రైతు, అక్కన్నపేట
వానకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. సీజన్ ఆరంభంలోనే విత్తనాల కోసం ఎండలో నిలబడే ఓపిక లేక పాసు పుస్తకాలు లైన్లో పెట్టి పడిగాపులు కాయాల్సి వచ్చింది. అయినా సరిపోను విత్తనాలు దొరకలేదు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎరువులు, విత్తనాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఇలాంటి పరిస్థితి వచ్చింది. – శ్రీధర్రెడ్డి, రైతు, నేరడిగుంట, అందోల్ మండలం