మెదక్ అర్బన్, జూన్ 30: పండించిన జొన్నలు కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం తగదని, అన్ని పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, ఈ విషయంలో అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కలెక్టరేట్ను వీడేదిలేదని, ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టి రైతుల తరపున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి హెచ్చరించారు. జొన్నల కొనుగోళ్లును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని దంతెపల్లి, కాట్రియాల, పర్వతాపూర్, కిషన్తండా, జామ్లాతండాలకు చెందిన రైతులతో కలిసి మెదక్ కలెక్టరేట్ ఎదుట మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుబాష్రెడ్డి ధర్నా నిర్వహించి సంఘీభావం ప్రకటించారు. జొన్నలు కొనుగోలు చేసిన అనంతరం మట్టి పెల్లలు ఉన్నాయనే కారణంతో మార్క్ఫెడ్ అధికారులు తిరిగి వెనక్కి పంపడాన్ని నిరసిస్తూ రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వానిదే బాధ్యత..
మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మాట్లాడుతూ జొన్న పంట సాగు చేసిన రైతులు మార్కెట్లో సరైన ధర లేక, ప్రభుత్వం కొనుగోలు చేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులు పండించిన ప్రతి పంటను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మట్టి పెల్లలు ఉన్నాయనే కారణంతో జొన్నలను తిరస్కరించడం సమంజసం కాదన్నారు. గతంలో మొలకలు వచ్చిన ధాన్యా న్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
అనంతరం జొన్నలు కొనుగోలు చేస్తామని మార్క్ఫెడ్ డీఎం బాలకృష్ణ డీఆర్వో అంబదాస్ హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. మెదక్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆరెళ్ల మల్లిఖార్జున్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతరావు, రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ చౌదరిచరిత, బీఆర్ఎస్ నాయకులు ఎస్కే అహ్మద్, ఉమామహేశ్వర్ శ్యామ్, నవీన్, దోమకొండ శ్రీను, అస్నుద్దీన్, విజయభాస్కర్రెడ్డి, సత్యపాల్, కిషన్బాబు, సంతోష్, శ్రావణ్గౌడ్, వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.
ప్రభుత్వ తీరు బాధాకరం..
ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని అన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన జొన్నలను నాణ్యత పేరుతో మట్టి పెల్లలు ఉన్నాయనే సాకుతో తిరిగి రైతులకే అప్పగించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ఆనగేశ్వర్రావుతో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలియజేసినట్లు తెలిపారు.
మార్క్ఫెడ్ అధికారులు జొన్నలను తిరిగి పంపిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. జొన్నల కొనుగోలుపై అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కలెక్టరేట్ నుంచి కదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వంటావార్పు చేస్తామని హెచ్చరించారు.