నర్సాపూర్, జూన్ 21: రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతున్నదని, వ్యవసాయం చేయడానికి రైతులు జంకుతున్నారని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూరియా యాప్ సక్రమంగా పనిచేయక రైతులు పడరానిపాట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ ప్రారంభమైనప్పటికీ రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరకడం లేదన్నారు.
డీలర్లు అధిక ధరలకు బ్లాక్మార్కెట్లో ఎరువులు, విత్తనాలు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉన్నదన్నారు. క్వింటాల్కు 6 నుంచి 8 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, అన్నిరకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి నేడు కేవలం ఏడు రకాల వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పడం మోసగించడమేనన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకున్నారని నేడు వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం 2017లో నర్సాపూర్లో ఇండోర్స్టేడియం కోసం రూ. రెండు కోట్ల 60 లక్షలు మంజూరు చేసిందని గుర్తుచేశారు. సమావేశంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్ద్దీన్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, నాయకులు షేక్హుస్సేన్, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.