మద్దూరు(ధూళిమిట్ట), జనవరి 4: వానకాలంలో పంటలు సమృద్ధిగా పండి ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. అదే ఉత్సాహంతో యాసంగి పనుల్లో నిమగ్నమయ్యారు. నిన్నమొన్నటి వరకు వరికోతలు, పత్తితీత తదితర వ్యవసాయ పనులతో బిజీబిజీగా గడిపిన రైతులు తిరిగి యాసంగి పనులు మొదలుపెట్టారు. ఉమ్మడి మద్దూరు మండలంలోని అన్ని గ్రామా ల్లో ఇప్పటికే యాసంగి సాగు కోసం రైతులు నారుమడులను సిద్ధ్దం చేసుకుని పొలం దున్నకాల్లో నిమగ్నమయ్యారు. దీంతో గ్రామాల్లో ఎక్కడచూసినా యాసంగి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ట్రాక్టర్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. వరి సాగులో రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులపై దృష్టి సారిస్తున్నారు. చెరువులు, వాగులతోపాటు బోరుబావుల నిండా నీరు ఉండడంతో రైతులు వడివడిగా యాసంగి సాగు పనుల వైపు అడుగులు వేస్తున్నారు.
గతేడాది యాసంగిలో వరి 18,750 ఎకరాలు, మొక్కజొన్న 750, మినుములు 97, వేరుశెనగ 250, పెసర 72, నువ్వులు 196, జొన్నలు 49, శనగలు 50, ఇతర పంటలు 100 ఎకరాల్లో సాగయ్యాయి. ఈ ఏడాది యాసంగిలో వరి 20,530, మొక్కజొన్న 810, వేరుశెనగ 350, పెసర 54, శనగ 70, నువ్వులు 212, జొన్నలు 54, ఇతర పంటలు 150 ఎకరాల్లో సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు వరి పంటపైనే అధికంగా ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు మా త్రం వరికి బదులుగా ఇతర పంటలు వేసుకొని అధిక దిగుబడులు సాధించవచ్చునని సూచిస్తున్నారు.
వరి సాగులో రోజురోజుకూ పెరుగుతున్న కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు వెదజల్లే పద్ధతితోపాటు డ్రమ్సీడర్ సహాయంతో నాట్లు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకేసారి వరి నాట్లు వస్తుండడంతో రైతులకు కూలీల సమస్య తీవ్రమవుతున్నది. మూడేండ్లుగా ఈ పద్ధతుల్లో వరి సాగు చేసిన రైతులు అధిక దిగుబడులు సాధించారు. దీనికితోడు కొంతమంది రైతులు వరి నాటు యంత్రాలతో నాట్లు వేస్తుండగా, మరికొంతమంది రైతులు ఇతర రాష్ట్రల నుంచి కూలీలలను తెప్పించి నాట్లు వేయిస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ సాగు విధానం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి అధిక లాభాలు పొందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.