గజ్వేల్ రూరల్, ఫిబ్రవరి 4: కూడవెల్లి వాగులోకి కాళేశ్వరం జలాలను వదల డంతో పంట పొలాలకు జీవం పోసిన ట్లయింది. వాగుపై 38 చెక్డ్యాంలు కాళేశ్వర గోదావరి నీటితో నిండి, మరో 60 కిలోమీటర్ల మేర ప్రవహించి మానేరులో కలవనున్నాయి.
ఒక్కరోజులోనే కూడవెల్లికి కాళేశ్వర జలాలు…
గజ్వేల్ మండలం కొడకండ్ల వద్దనున్న కొండపోచమ్మ ప్రాజెక్టు కాలువ ద్వారా కాళేశ్వర గోదావరి జలాలను ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి శుక్రవారం వదలడంతో కూడ వెల్లిలోకి నీటి ప్రవాహం ఒక్క రోజులోనే చేరుకున్నది. గజ్వేల్, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లోని చెక్డ్యాంల్లో రెండు రోజుల్లో పుష్కలంగా నీరు చేరే అవకాశాలున్నాయి. ఈ నీటి విడుదలతో కొడకండ్ల, రిమ్మనగూడ, బూరుగుపల్లి, సింగాటం, అహ్మదీపూర్, కొల్గూర్ గ్రామాలతోపాటు తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల్లోని రైతులు సాగు చేసిన వరిపొలాలు ఎండిపోకుండా ఉంటాయి. బోర్లలో నీటిమట్టం అధికంగా పెరిగే అవకాశాలుంటాయి. దుబ్బాక మండలం ఆకారం వద్ద గోదారమ్మ జిల్లాను వీడి కరీంనగర్ జిల్లాలోని అప్పర్ మానేరు డ్యాములో కలుస్తుంది.
కూడవెల్లిలో పుష్కలంగా నీళ్లు..
రెండు రోజుల క్రితం కూడవెల్లి వాగులోకి కాళేశ్వరం నీటిని వదిలారు. మూడేండ్లుగా వాగులో పుష్కలంగా నీళ్లు ఉండడంతో వరిసాగు చేసుకుంటున్నం. ఎండలు ఎక్కువైనా నీళ్ల సమస్య రావడం లేదు. రైతులం ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
– యాదాగౌడ్, రైతు, లింగంపేట (గజ్వేల్ రూరల్)
సంతోషం అనిపిస్తుంది..
కూడవెల్లి వాగులోకి కాళేశ్వరం నీటిని విడుదల చేయడంతో రైతులందరం ఎంతో సంతోషంగా ఉన్నం. మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూడవెల్లి వాగుకు దగ్గర్లోనే కట్టడంతో పరిసర ప్రాంత రైతులు వరి వేసుకునేందుకు వీలుంటున్నది. బోర్లు నీళ్లు ఎక్కువ పోస్తున్నయి. పొలాలకు సరిపడా కరెంట్ రావడంతో ఇప్పటి వరకు వేసిన వరి బాగానే ఉంది.
– వెంకట్రెడ్డి, రైతు, లింగంపల్లి (గజ్వేల్ రూరల్)
రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు…
హల్దీవాగుపై ఆధారపడి ఎంతో మంది రైతులం వ్యవసాయం చేస్తున్నాం. రెండేళ్ల నుంచి రైతు సాగు గోస తీర్చడానికి సర్కార్ కొండపోచమ్మసాగర్ ద్వారా హల్దీవాగులో నీళ్లు వదలడంతో ఎన్నడూలేనివిధంగా ఎండాకాలంలో వాగుపై ఉన్న చెక్డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో యాసంగితో సైతం పూర్తిస్థాయిలో సాగు చేపట్టడంతో పాటు పంటలు ఎండిపోతాయన్న భయం లేదు. బోరుబావుల్లో సైతం నీటి ఊటలు పెరగడంతో మెట్ట పొలాల్లో యాసంగి సాగు చేస్తున్నాం.
– శివశంకర్, రైతు (వెల్దుర్తి)