చేగుంట, మార్చి 5: అనధికార కరెంట్ కోతలు, అడుగంటిన భూగర్భ జలాలకు తోడు కాల్వల ద్వారా నీరందక పోవడంతో వరిపైరు ఎండుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామంలో రైతు రాచపల్లి దుర్గయ్య పక్క రైతు వద్ద నీటిని పాలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. ఇప్పుడు పక్క రైతు పొలం పారక పోవడంతో నీళ్లు ఇవ్వడం లేదు.
సాగు చేసిన వరి పంటకు నీళ్లు లేకపోవడంతో బోరు వేయించాడు. మూడు వందల లోతు బోరు డ్రిల్ చేసినా ఉట్టి దుమ్మే వచ్చిందని, చుక్క నీరు రాలేదని దుర్గయ్య భార్య బాలమణి వాపోయింది. చేగుంట మండల పరిధిలోని గొల్లపల్లిలో వరి పొలాలకు నీళ్లులేక ఎండిపోతున్నాయని,ప్రభుత్వం స్పందించి కాలువల ద్వారా నీరందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.