ఆరుగాలం కష్టించి పండించిన వడ్లను అమ్ముకుందామంటే అన్నదాతకు అరిగోస అవుతున్నది. యాసంగిలో పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెస్తే కాంటా కావడం లేదు. 10 రోజులు దాటినా వడ్ల కాంటా పెట్టక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు తాలు, తేమశాతం, తరుగు పేరిట నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 1039 కేంద్రాలు ప్రారంభించినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నా, వాస్తవానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఇందులో సగానికి సగం కేంద్రాల్లో సేకరణ జరగడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కరువుయ్యాయి. గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు సరిపడా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులు కొనుగోలు కేంద్రానికి వడ్లను తేగానే తూర్పార పట్టుమంటున్నారు. అందుకు తగ్గట్టుగా కొన్ని సెంటర్లలో ప్యాడీ క్లీనర్ లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్యాడీ క్లీనర్ అడిగితే మీరే బయట తెచ్చుకోవాలని నిర్వాహకులు సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హుస్నాబాద్ టౌన్, ఏప్రిల్ 19: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్యార్డులో సింగిల్ విండో సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన సెంటర్లో ధాన్యం సేకరణ వేగంగా జరగడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్ట్టుపక్కల గ్రామాల రైతులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో ధాన్యం తెస్తున్నారు. వడ్లు ఆరబోసుకునేందుకు స్థలం సరిపోకపోవడంతో రైతులు తెచ్చిన ధాన్యం కుప్పలు కుప్పలుగా రోజుల తరబడి ఉండిపోతున్నది. ఆరబోసిన ధాన్యం కొనుగోలు చేస్తే తప్ప మరోరైతు ధాన్యం ఆర బోసుకునే పరిస్థితి మార్కెట్ యార్డులో లేదు. వారం నుంచి పదిరోజుల వేచిఉంటే తప్పా కాంటా కావడం లేదని రైతులు వాపోతున్నారు.
బెజ్జంకి మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీల కొరత చాలా ఉంది. మా వడ్లు తూకం వేశారు. వర్షం వస్తే తడిచేలా ఉంది. చాలామంది రైతులం సెంటర్ నిండా వడ్లు పోసినాం. హమాలీలు తక్కువగా ఉండటంతో తూకం ఆలస్యం అవుతున్నది. దీనికి తోడు లారీల కొరతతో వడ్ల లోడ్లు వెళ్ల్లడం లేదు. అధికారులు స్పందించి హమాలీలను పెంచి వేగంగా తూకం వేసి రైస్మిల్లులకు ధాన్యాన్ని తరలించాలి.
కొనుగోలు కేంద్రానికి వడ్లను తీసుకొచ్చి పది రోజులు అవుతుంది. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రంలో కాంటా పెడతలేరు. అధికారులు పట్టించుకోవట్లేదు. రోజు సాయంత్రం ఉరుములు మెరుపులతో వాన మొగులైతే భయం వేస్తుంది. అధికారులు వెంటనే వడ్లను కొనాలి.
వడ్లు తీసుకువచ్చి ఎనిమిది రోజులు అవుతుంది. కనీసం సౌకర్యాలు కూడా లేవు. తాగుదామంటే నీళ్లు లేవు. వడ్లు కొనేటోళ్లు కూడా లేరు. మా రైతులను ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా అధికారులు రైతులను పట్టించుకొని వడ్లను కొనాలి. వాన మొగులు అయితే భయం వేస్తుంది.
సిద్దిపేట మార్కెట్లోకి టాక్టర్ వడ్లు తీసుకొచ్చి పోసిన. వారం రోజులైతాంది. బాయికాన్నే ఆరబెట్టుకొని వడ్లు తెచ్చిన. రాంగానే కొనలేదు. ఇంతల్నే వాన పడ్డది. వడ్లు తడిసినయి. పచ్చిగున్నయి మల్ల ఆరబెట్టాలన్నరు. మొత్తం ఎండపోసిన.. రోజురోజు వడ్లు వత్తున్నయి. ఆరబెట్టేందుకు జాగ ఉంటలేదు. ఇప్పడు మొత్తం ఎండినయి. మధ్యాహ్నం (శుక్రవారం) అయితంది. సెలక్షన్ చేసేటోళ్లు ఇది వరకు రాలె. మొగులును చూత్తే భయమైతంది. వానెప్పుడు పడుతదోనని.. టార్పాలిన్ కవర్లు ఇంటి నుంచే తెచ్చుకున్న.. ఇక్కడ అడిగితే పాసుబుక్కులు కావాల్నట. మార్కెట్ల గోస అయితాంది.. ఎంబడెంబడి వడ్లను కొని తీసుకపోవాలె.
నారాయణరావుపేట కొనుగోలు కేం ద్రానికి వారం రోజు ల కింద వడ్లు తెచ్చి న. ఇప్పటి వరకు వడ్లు కొనడానికి ఒక్క అధికారి కూడా రాలేదు. కొనుగోలు కేంద్రంలో రైతులకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు. రైతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం వడ్లు ఎప్పుడు కొంటారో కూడా చెప్పడం లేదు.
అంజుమాన్ బ్యాంకోళ్లు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిండ్రు. కానీ, వడ్లను కాంట పెడుత లేరు. నేను ఈడ వడ్లను పోసి ఇయ్యాలటికి 6 రోజులు ఐతుంది. మొన్న వాన చినుకులు పడితే టార్ఫాలిన్ కవరు ఇయ్యంటే మీరే కొనుకొమ్మని అంజుమాన్ బ్యాంకోళ్లు చెప్పిండ్రు. వడ్లు నానకుంట ఉండడానికి టార్ఫాలిన్ కవర్లను కిరాయికి తెచ్చుకున్నా. రెండు రోజుల్లో వడ్లను ఈడ కొనకుంటే ఎంతో కొంతకు బయట సేట్లకే వడ్లను అమ్ముకుంట.
వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇవ్వడం లేదు.ఐకేపీ కేంద్రాలకు వడ్లు వచ్చే సమయానికి చేతులెత్తేసింది. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, డిసెంబర్ 9న అధికారంలోకి వస్తున్నామని..మాఫీ చేస్తామని టీవీల్లో, పత్రికల్లో ఊదరగొట్టారు. రైతులు నిజంగానే నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే పంగనామాలు పెట్టిండు రేవంత్రెడ్డి. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని ఆగస్టులో రుణమాఫీ చేస్తానని కొత్తపాట ఎత్తుకుండు.