అక్కన్నపేట, ఫిబ్రవరి 20: కేసీఆర్ సారు కడుపు సల్లగుండ…ఆయన ఏలినన్ని రోజులు కరువు లేకుండే. పోయిన ఏడు గీదినం(యాసంగి)లో చెరువులు, కుంటల్లో నీళ్లు ఉండేవి. అసొంటిది ఇప్పుడు నీళ్లు లేకుండా పోయినయి. పెట్టుబడి పెట్టి వరి, మక్క చేన్లు ఏస్తే కాలం పోయింది. బోర్లు, బావుల్లో నీళ్లు అడుగున పడ్డయి. కరెంటు ఇచ్చినట్లే ఇస్తుర్రు.. వస్తాంది, పోతాంది.. పొలాలు పారుతలేవు. వరుస తడులతోనైనా వరిచేన్లు బతికి బయటపడేటట్లు లేవు. ఎనకటి కాలం యాదికి అస్తున్నది.. అంటూ సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పెద్దతండాకు చెందిన రైతు గుగులోతు రాములు ఆవేదన ఇది. ఒక్క రైతు రాములే కాదు, రైతులందరూ కేసీఆర్ను యాది చేసుకుంటున్నారు. ఆయన పాలన గుర్తుచేసుకుంటున్నరు. అక్కన్నపేట మండల వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటి పంటచేన్లు ఎండిపోతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మండల కేంద్రమైన అక్కన్నపేటతో పాటు, అంతకపేట, కట్కూరు, పంతుల్తండా, మోత్కులపల్లి, రామవరం, నందారం, గండిపల్లి, ధర్మారం, జనగామ, పోతారం(జే), కపూర్నాయక్తండా, పెద్దతండా, చాపగానితండా, కేశనాయక్తండా, దుబ్బతండా, చౌటపల్లి, మల్లంపల్లి, కుందన్వానిపల్లి, మైసమ్మవాగుతండా గ్రామ పంచాయతీల పరిధిలో కరువును ప్రతిబింబించేలా పరిస్థితులు ఉన్నాయి. ఆయా గ్రామాల పరిధిలోని చెరువులు, కుంటల్లో నీళ్లు అడుగంటిపోతున్నాయి. బావులు, బోర్లను నమ్ముకొని పంటలు సాగుచేసిన రైతులు కండ్ల ముందే ఎండిపోతున్న పంటలను చూసి కన్నీళ్లు పెడుతున్నారు. నీరందక వరి, మక్క చేన్లు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. కొందరు రైతులు బోర్లు వేసేందుకు సిద్ధపడుతుండగా, మరికొందరు రైతులు వ్యవసాయ బావుల్లో క్రేన్ల ద్వారా పూడికతీత పనులు మొదలు పెట్టారు.
నాకున్న మూడెకరాల్లో ఎకరం మక్క, రెండెకరాల్లో వరి వేసిన. మొత్తం చేను ఎండిపోయింది. రెండు పాలిచ్చే ఆవులను మేపుతున్న. వరి సన్నపొట్టకు వచ్చింది. ఒక్కసారిగా బోర్ బంద్ అయ్యింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కండ్ల ముందే పంట చేన్లు ఎండిపోయే కాలం వచ్చింది. బతుకుదెరువు కోసం మళ్ల దేశాలు పోయేటట్టు పరిస్థితులు ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ల పరిస్థితి కూడా గట్లానే ఉంది.
గింత తొందరగా నీళ్లు అడుగున పడుతాయ్ అనుకోలేదు. పుష్కలంగా ఉండే నీళ్లు యాడికి పోయినయో తెలియకుంటా అయ్యింది. ముందుగా వరినాట్లు వేస్తే వరికి రోగాలు వచ్చి మందులు కొట్టి ఇగ వరి చేన్లు కొలుకుంటాయనే లోపే నీటి ఎద్దడి మొదలైంది. అటో, ఇటో నడి ఎండాకాలం వరకు పొలాలు పారేది. అసొంటిది గిప్పుడే నీళ్లు అడుగుకుపోయినై. పెట్టుబడికి మునిగి, పంట ఎండిపోయి ఆగమయ్యే కథ మొదలైంది. దేవుడు కనుకరిస్తే తప్పా పంటలు బతికే పరిస్థితి లేదు.