సిద్దిపేట, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. వచ్చి పోయే విద్యుత్తో మోటర్లు కాలిపోతున్నాయి. తరచూ మోటర్లు కాలడంతో రైతులకు పెట్టుబడి తడిసి మోపెడవుతుంది. వారం రోజుల నుంచి గ్రామాల్లో బోరు మోటర్లు బాగా కాలిపోతున్నాయి. సరాసరి ఒక్కో మెకానిక్ రోజుకు పది నుంచి పదిహేను మోటర్ల వరకు మరమ్మతులు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యత లేని విద్యుత్ సరఫరా చేయడంతోనే ఇలా మోటర్లు కాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో నాణ్యమైన కరెంట్ రావడంతో మోటర్లు కాలలేదు. గుంట పొలం ఎండలేదని రైతులు గుర్తు చేస్తున్నారు.
మరో వైపు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజు రోజుకూ భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఫలితంగా యాసంగిలో సాగు చేసిన వరి, మొక్కజొన్న తదితర పంటలు ఎండిపోతున్నాయి. పక్కనే రిజర్వాయర్లు ఉన్నా పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 3,30,000 వేల ఎకరాలు, మెదక్ జిల్లాలో 2,60,000 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 83,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. గత యాసంగి కంటే ఈసారి కొంత మేర వరి సాగు విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుత యాసంగిలో సాగుచేసిన వరి పొట్ట దశకు వచ్చింది. ఈ సమయంలో నీళ్లు పుష్కలంగా కావాలి. చెరువులు, కుంటలు, బోరు బావులు ఎండిపోతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నది.
వరితోపాటు ఇతర పంటలను కాపాడుకోవడానికి రైతులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడెనిమిదేండ్ల తర్వాత మళ్లీ రైతుల పొలాల వద్ద పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడక ముందు ఎక్కడ చూసినా బోరు బండ్లు కనిపించేవి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బోరు బండి, బావుల వద్ద క్రేన్లు కనిపించలేదు. ఇవాళ ఎక్కడ చూసినా పంట పొలాలను రక్షించుకోవడానికి రైతులు బోర్లు వేస్తున్నారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల తదితర ప్రాంతాల్లో ఎటు చూసినా బోరు బండ్లు దర్శనమిస్తున్నాయి. మరో వైపు పూడికతీతతోపాటు బావులను తవ్వుతున్నారు. ఫలితంగా సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం బోరు బండ్లు, క్రేన్ల యజమానులు బిజీగా మారారు. ఇంకో వైపు ఎండిన పంట చేన్లలో రైతులు పశువులను మేపుతున్నారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతాంగానికి నాణ్యమైన 24 గంటల కరెంట్ సరఫరా చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన కరెంట్ రావడం లేదు. దీంతో బోరుబావుల మోటర్లు కాలిపోతున్నాయి. బోరు నుంచి మోటరును పైకి తీసి రిపేరు చేయించి మళ్లీ దించడానికి ఎంత లేదన్నా సుమారు రూ. 10 వేల వరకు ఖర్చు అవుతుంది. ఒక్కో రైతు మోటరు వారంలో రెండుసార్లు కాలిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా కాలిపోయిన మోటర్లు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ మెకానిక్లకు పనిలేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే కరెంట్ మోటరు మెకానిక్లకు చేతినిండా పని కల్పించినైట్లెంది. మోటర్ల రిపేరు కొంత ఆలస్యమైతే పొలాలు ఎండిపోతున్నాయి.
నాకు రెండున్నర ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఇందులో ఎకరంన్నర వరి, మరో ఎకరం వేరుశనగ, పెసర పంటలు సాగుచేశా. కాల్వల ద్వారా చెరువులకు సరైన సమయంలో నీళ్లు రాలేదు. ప్రస్తుతం నీళ్లు లేక పంటలు ఎండిపోయాయి. మొత్తం రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టా.
– కంకణాల కనకరాజు, జక్కాపూర్, నారాయణరావుపేట మండలం, సిద్దిపేట జిల్లా
నీళ్లు చాలక చేతికి వచ్చిన మొక్కజొన్న చేను ఎండిపోతుంది. ఐదెకరాలు కౌలుకు తీసుకున్నా. అందులో 2.20 గుంటల్లో మొక్కజొన్న, ఎకరం వరి సాగుచేశా. నీరు లేక 1.20 గుంటల భూమి వదిలిపెట్టా. గతంలో కుంటలో నిండానీరు ఉండే. కౌలుకు తీసుకున్న పొలం మొత్తం పారింది. ఈ సంవత్సరం కుంటలో నీరు లేక బావి ఎండిపోయింది. మరో నాలుగు తడులు పెడితే మొక్కజొన్న పంట చేతికి వచ్చేది. ఇప్పుడు నీళ్లు అందుతలేవు. చేను ఎండిపోయి, పంట కష్టంగా మారింది. ఇప్పటికే మొక్కజొన్న, వరికి కలిపి రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టా. ఈసారి పెట్టుబడి వచ్చుడు కూడా గగనమైంది. కౌలు పైసలు రూ.75,000, పెట్టుబడి కలుపుకొంటే రూ.1,35,000 వేల వరకు ఖర్చు వచ్చింది. ఈసారి లాగోడి ఎల్లుడు కూడా కష్టమే.
– ముక్కెర దేవయ్య, చందులాపూర్, చిన్నకోడూరు మండలం, సిద్దిపేట జిల్లా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీ సారే యాసంగి పంటలకు నీళ్ల ఇబ్బంది ఏర్పడింది. మా గ్రామంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో రైతుల బోర్లలో నీళ్లు తక్కువ అయ్యాయి. రైతులు పొద్గుగాళ్లనే నా దగ్గరకు వచ్చి బోరులో మరో రెండు పైపులు దించాలని తీసుకువెళ్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బోరు, బావుల్లో నీళ్లు పుష్కలంగా ఉండేది.
– బచ్చల బాబు, మోటరు మెకానిక్, గురువన్నపేట, కొమురవెల్లి మండలం సిద్దిపేట జిల్లా
నాకు ఐదు ఎకరాల భూమి ఉంది. యాసంగిలో నాలుగు ఎకరాల్లో వరిసాగు చేశా. ఇప్పుడు నీళ్లు రాక మూడు ఎకరాల్లో వరి పంట పూర్తిగాఎండిపోయింది. కేసీఆర్ సారు ఉన్నప్పుడు కాళేశ్వరం నీళ్లతో పంట పొలాలు పచ్చగా ఉండేవి. ఇప్పుడు నీళ్లు అందుతలేవు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పంటలు ఎండిపోయాయి. పెట్టుబడి కోసం మొత్తం రూ.60 వేల వరకు ఖర్చు చేశా.
– గవ్వ కనకయ్య, గ్రామం, మండలం నారాయణరావుపేట, సిద్దిపేట జిల్లా
ఎకరం పొలం, ఇంత నువ్వుల పంట సాగుచేశా. నిరుడు, ముందటేడు బాగానే ఉండే. ఈసారి బావుల్లో నీళ్లు లేవు. వరుస తడులు అయితున్నాయి. బావి తవ్వాలంటే స్థోమత లేదు. అందుకనే ఇరవైవేల రూపాయలు ఖర్చుచేసి పూడిక తీయిస్తున్నా. మూడురూపాయల మిత్తికి డబ్బులు తెచ్చి పనులు చేయిస్తున్నా. ఎనిమిదేండ్ల నుంచి నీళ్లకు ఇంత తిప్పలు రాలేదు.
– పచ్చిమట్ల ఎల్లయ్య, రైతు, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా
యాసంగిలో రెండు ఎకరాల్లో వరిసాగు చేశా. గ్రామంలో ఉన్న చెరువులకు నీళ్లు సమయానికి రాలేదు. ఇప్పుడు నీళ్లు లేక మొత్తం రెండు ఎకరాలు ఎండిపోయింది. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఉంది. రెండు ఎకరాల్లో పంటపెట్టుబడి కోసం రూ.20 వేల వరకు ఖర్చు పెట్టా. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు.
– కోడి సూరయ్య, జక్కాపూర్, నారాయణరావుపేట మండలం
నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రంగనాయకసాగర్ ప్రాజెక్టు నుంచి కాల్వల ద్వారా గ్రామంలోని చెరువులకు నీళ్లు వచ్చేవి. ఇప్పుడు రావడం లేదు. నీళ్లు రాకపోవడంతో రెండు ఎకరాల్లో పంట ఎండిపోయింది. కరెంట్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలుస్తలేదు. పంట పెట్టుబడి కోసం రూ.25 వేల వరకు ఖర్చు చేశా. కాల్వల ద్వారా నీళ్లు వస్తే పంటలు పండుతుండే.
– పుర్ర శంకర్, గ్రామం, మండలం నారాయణరావుపేట , సిద్దిపేట జిల్లా