సంగారెడ్డి మే 29(నమసే తెలంగాణ): వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో లోపాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ ‘ధరణి’కి శ్రీకారం చుట్టారు. ధరణి రైతులు, భూ హక్కుదారుల్లో కొండంత ధైర్యం నింపిందంటే అతిశయోక్తి కాదు. సంగారెడ్డి జిల్లాలో ఒకప్పుడు భూముల రికార్డుల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండేది. భూముల రిజిస్ట్రేషన్ల కోసం రైతులు, హక్కుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మ్యుటేషన్ల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. పహాణి కావాలన్నా, పట్టాదారు పాసుపుస్తకాల్లో పేరు మార్పులు, పౌతీ కావాలన్నా ముప్పుతిప్పలు పడేవారు. నెలల తరబడి తహసీల్, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సివచ్చేది. ధరణి పోర్టల్తో రైతుల ఇక్కట్లన్నీ తీరాయి. రైతుల భూ రికార్డులు పోర్టల్లో భద్రంగా ఉన్నాయి. తహసీల్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేస్తుండడంతో దూరభారం తగ్గింది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలు అందుతుండడంతో ధరణి సేవలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
‘ధరణి’తో భూ క్రయ విక్రయాలు సులభతరం
ధరణి పోర్టల్ ప్రారంభానికి ముందు సంగారెడ్డి జిల్లాలో భూ క్రయవిక్రయాలకు రైతులు, భూ హక్కుదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా భూ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవటం, రెవెన్యూ సిబ్బంది చేతివాటం కారణంగా రికార్డులు తారుమారు కావటంతో గందరగోళ పరిస్థితి ఉండేది. ధరణి అమలులోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రైతులు మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే అక్కడ పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ వెంటనే మ్యుటేషన్ జరుగుతుంది. ఆ తర్వాత కొద్దిరోజుల్లోనే పట్టాదారు పాసుపుస్తకం రైతు చేతికి అందుతుంది. భూముల రికార్డులు పూర్తిగా ధరణి పోర్టల్లో ఆన్లైన్లో భద్రంగా ఉంటాయి. అలాగే రైతులు పహాణి, 1బీ సులువుగా ఆన్లైన్లో పొందవచ్చు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లతో పాటు, భాగ పరిష్కారం(భూ పంపకం), ఫౌతీ (భూహక్కుల బదిలీ), నాలా కన్వర్షన్ (వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మార్పు) ధరణితో సులువుగా పూర్తి అవుతున్నాయి.
రెండేండ్లలో 1,08,144 పైగా రిజిస్ట్రేషన్లు
సంగారెడ్డి జిల్లాలో ధరణి నిర్వహణ విజయవంతంగా కొననసాగుతుంది. గత రెండేళ్లలో 1,08,144 రిజిస్ట్రేషన్లు, ఫౌతీ, నాలా, భాగ పరిష్కారాలు జరిగాయి. రెవెన్యూ అధికారుల సమాచారం మేరకు 2021లో 21,728 రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో 17641 వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, 65 భాగ పరిష్కారాలు (భూ పంపకం), 1784 ఫౌతీ(భూ హక్కుల బదిలీ), 694 నాలా, 1544 పెండింగ్ మ్యుటేషన్లు పూర్తి అయ్యాయి. 2022లో ధరణి ద్వారా 86,416 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఇందులో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు 70,325, భాగ పరిష్కారాలు 256, ఫౌతీలు 8608, నాలా 3919, పెండింగ్ మ్యుటేషన్లు 3308 జరిగాయి.