గజ్వేల్, మే 20: ముట్రాజ్పల్లి గ్రామానికి చెందిన రైతు యాదగిరి ఎకరం విస్తీర్ణంతో వరి సాగుచేశాడు. పదిరోజుల క్రితం మిషన్ సాయంతో కోత కోశాడు. మొదటిరోజు వరి కోసినప్పటి నుంచి భారీగా వర్షాలు కురుస్తుండడంతో పూర్తిస్థాయిలో వరి కోయలేకపోయాడు. గరువిచ్చినరోజు మిషన్ సాయంతో కోద్దామంటే మిషన్ పొలంలో దిగబడుతుంది. పొలం మొత్తం ఎండాలంటే వడ్లేమో వర్షానికి దెబ్బతింటాయనే భయంతో సోమవారం నలుగురు బీహార్ కూలీలతో కోత కోయిస్తున్నాడు. ఆరబెట్టిన వడ్లు ఎండకు ఆరుతుండగా సాయంత్రం సమయంలో కురిసే వర్షాలకు మళ్లీ తడవడంతో దెబ్బతింటున్నాయని వర్షాలతో ఈసారి వడ్ల ఆరబెట్టేందుకే ఎక్కువ రోజులవుతుందన్నాడు. రోడ్లపై చాలామంది రైతులు నేటికీ వడ్లను ఆరబెడుతున్నారు. ఇంకా కోతకోయని పొలాలున్నాయి. ఇలాగే వర్షాలు కురిస్తే వడ్లను అమ్ముకోవడం కష్టం. ఎండిన వడ్లను అధికారులు త్వరగా కొనుగోలు చేపట్టాలి. అప్పుడైనా రైతులకు మంచి జరుగుతుంది.