బీబీనగర్, ఆగస్టు 9 : మండలంలోని కొండమడుగు శివారులో డ్రగ్స్ తయారీ, రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సందర్భంగా రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్తో పాటు డ్రగ్స్ తయారీలో వినియోగించే 40 కిలోల అసిటోన్ లిక్విడ్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. బీబీనగర్ పోలీసులు, ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. శనివారం కొండమడుగు శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలోఎంహెచ్-49, సీడబ్య్లూ1313 నంబరు గల ఫార్చ్యూనర్ కారును తనిఖీ చేయగా 27 కిలోల మెఫెడ్రోన్,40 కిలోల అసిటోన్ లిక్విడ్, ఆరు సెల్ ఫోన్లను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు కొండమడుగులోనే డ్రగ్స్ తయారు చేసి నాగ్పూర్కు తరలిస్తునట్లు తెలిసింది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు కొండమడుగులోని వేటుకూరి ల్యాబ్స్లో నిందితులు మెఫెడ్రోన్ తయారు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇక్కడ తయారు చేసిన డ్రగ్స్ను నాగ్పూర్లో పంపిణీ చేసేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ల్యాబ్లో తనిఖీలు నిర్వహించి డ్రగ్ తయారీలో ఉపయోగించిన రియాక్టర్, సెంట్రిఫ్యూజ్తో పాటు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో నాగ్పూర్కు చెందిన చేతన్ మధుకర్ మెష్రామ్ (49), అస్సాంలోని మారిగావ్కు చెందిన ముజామల్ హక్ (25), నాగ్పూర్కు చెందిన ఆకాశ్ అశోక్ గవాండే (31), హైదరాబాద్ చందానగర్కు చెందిన ఉపద్రష్ట రమణమూర్తి (65) ఉన్నారు. రమణమూర్తి వేటుకూరి ల్యాబ్స్ ఇన్ చార్జిగా వ్యవహరించినట్లు తెలిపారు.
అస్సాంకు చెందిన ఎండీ అయూబ్ అలీ, నాగ్పూర్కు చెందిన చందా ప్రదీప్ ఠాకూర్, గోపాల్ సిర్పట్ పటేలియా, వేటుకూరి ల్యాబ్స్ యజమాని వేటుకూరి రామరాజు పరారీలో ఉన్నారు. దర్యాప్తు అనంతరం వేటుకూరి ల్యాబ్స్ను సీజ్ చేస్తామన్నారు. డ్రగ్స్ తయారీ, రవాణా, విక్రయాలపై చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అక్షాంష్ యాదవ్ తెలిపారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందన్నారు. ఎస్డీపీవో శ్రీనివాస్ నాయుడు పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్లో ఎస్వోటీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ బాబు, ఇన్ స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎస్సైలు కృష్ణయ్య, రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.