మద్దూరు(ధూళిమిట్ట), నవంబర్29: తనకు తెలియకుండా తన తండ్రి ఏకపక్షంగా సోదరుల పిల్లలకు భూమిని పట్టా చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న ఓ రైతు తహసీల్దార్ ఛాంబర్లో తహసీల్దార్ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. లద్నూర్ గ్రామానికి చెందిన కాసర్ల రామస్వామికి బాలమల్లు, శ్రీనివాస్, కనకరాజు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇటీవల సోదరుల మధ్య ఆస్తి పంపకాల విషయంలో గొడవలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో రామస్వామి తన పేరిట ఉన్న 1.32 ఎకరాల భూమిని బాలమల్లు, శ్రీనివాస్ల కుమారులు భానుచందర్, హరీశ్ పేరు మీద పట్టా చేసేందుకు ధరణిలో స్లాట్బుక్ చేశారు. పట్టాకోసం శుక్రవారం వీరంతా తహసీల్ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న రామస్వామి చిన్నకుమారుడు కాసర్ల కనకరాజు తహసీల్ కార్యాలయానికి చేరుకున్నాడు. తనకు తెలియకుండా తన తండ్రి తన సోదరుల పిల్లల పేరిట అక్రమంగా పట్టా చేసేందుకు యత్నిస్తున్నారని, దీనిని వెంటనే నిలిపివేయాలని తహసీల్దార్ ఛాంబర్లోకి మందు డబ్బాతో ప్రవేశించి, తహసీల్దార్ రహీం ఎదుటే ఆత్మహత్యకు యత్నించాడు. ఛాంబర్లోని పలువురు కనకరాజును అడ్డుకొని వారించారు. ఈ విషయమై తహసీల్దార్ రామస్వామిని తన ఛాంబర్లోకి పిలిపించుకొని మాట్లాడారు. తన ముగ్గురు కుమారులకు సమానంగా తన వద్ద ఉన్న భూమిని పట్టాచేస్తానని అంగీకరించడంతో గొడవ సద్దుమణిగింది. కాగా, వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేసినట్లు తహసీల్దార్ రహీం తెలిపారు.