హుస్నాబాద్టౌన్, డిసెంబర్ 28: హుస్నాబాద్లో గురువారం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమ ఏర్పాట్లలో అధికారులు విఫలమయ్యారు. పలు చోట్ల దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన ప్రజలకు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేక చాలా సేపు నిలబడే ఉన్నారు. పలు కేంద్రాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. దరఖాస్తుదారుల అనుమానాలు నివృత్తి చేసేందుకు పలుచోట్ల అధికారులు తెలియదని సమాధానం ఇచ్చారు. కిరాయి ఇంట్లో ఉంటున్న తమకు గృహ విద్యుత్ ఇచ్చేందుకు దరఖాస్తులు ఎలా చేయాలని పలువురు అడిగిన ప్రశ్నలకు తెలియదనే సమాధానం చెప్పారు. ఆధార్, రేషన్కార్డులు స్థానికంగా ఉన్నాయని, కాని తమకు గ్రామంలో స్థలం ఉన్నదని, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని ప్రశ్నిస్తే సమాధానం రాలేదని పలువురు వాపోయారు. కొత్త రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకోసం భారీగా దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు. పట్టణంలోని కేబీకాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో దరఖాస్తులు నింపే విషయంలో ఇద్దరు మహిళా కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొన్నది.
హుస్నాబాద్ పట్టణంలోని 4వ వార్డులో నిర్వహించిన ప్రజా పాలనలో 371 కుటుంబాలకు 300 దరఖాస్తు ఫారాలు మాత్రమే అధికారులు వార్డుకు ఇచ్చారు. ఈ వార్డుల్లో దాదాపు 400కు పైగా కుటుంబాలు ఉన్నప్పటికీ దరఖాస్తులు తక్కువగా ఇవ్వడంతో ఒంటిగంట వరకే కార్యక్రమం ముగించారు.
మాకు ఇల్లు, పింఛన్ కావాలని అడిగితే సరిగా చెప్తలేరు. మూడుమాట్ల అఫీసుకాడికి వచ్చిన. ఈ జిరాక్స్ తేలేదని, ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు జిరాక్స్ కావాలని చెప్తుండ్రు. మూడుమాట్ల వెనక్కి పంపిండ్రు. ఇబ్బంది అయితాంది.