Child Marriages | మెదక్ రూరల్ ఫిబ్రవరి 18 : బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మహిళాశిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ‘బాల్య వివాహ ముక్త్ భారత్ 1-100 రోజుల ప్రత్యేక కార్యక్రమం’లో భాగంగా మంగళవారం జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవితో కలిసి ప్రత్యేక ప్రచార వాహనాన్ని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనంలోని మైక్ సదుపాయంతో గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ బాల్యవివాహాలపై అవగాహన కల్పిస్తామన్నారు. బాల్యం ఎంతో విలువైన దశ అని, బాలబాలికలకు విద్య, ఆరోగ్యం, రక్షణ హక్కులు కల్పించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. బాల్య వివాహాల వివరాలు తెలిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా చేయడంలో అందరూ బాధ్యత వహించాలని చెప్పారు.
జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి హేమ భార్గవి మాట్లాడుతూ.. 100 రోజుల కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, గ్రామసభలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన తండాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ రామచంద్ర రాజు, జిల్లా బాలల సంరక్షణ అధికారి నాగరాజు, మహిళా శక్తి కేంద్ర కోఆర్డినేటర్ సంతోషి, విజన్ సంస్థ డైరెక్టర్ కైలాష్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు రాజు, శరత్, సిబ్బంది సంజీవ్, నవనీత, జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
