సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 30: ఆర్టీసీ బస్సులో ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్లో ఒక వ్యక్తి ఎండు గంజాయి తరలిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందింది. ప్రొహిబిషన్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ రీజియన్ అసిస్టెంట్ కమిషనర్ రఘురాం ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ మెదక్ రీజియన్ బృందం సంబంధిత బస్సులో తనిఖీలు చేసి ఎండు గంజాయితో ప్రయాణిస్తున్న వ్యక్తిని సంగారెడ్డిలో పట్టుకున్నారు. సదరు వ్యక్తి వద్ద 8 కిలోల ఎండు గంజాయి, ఒక ఫోన్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నిందితుడు నాగల్గిద్ద మండలం కంద్యానాయక్ తండాకు చెందిన రాథోడ్ సీతారాంగా గుర్తించారు. ఎండు గంజాయిని, సీతారంను సంగారెడ్డి పట్టణ పోలీసులకు అప్పగించారు.
ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సీఐ హెచ్ఏ మోహన్కుమార్, ఎస్సై అనిల్కుమార్, హెడ్ కానిస్టేబుల్స్ ఎండీ అలీం, ఈ.విఠల్, కానిస్టేబుళ్లు మల్కయ్య, రామారావు నాయక్ ఉన్నారు.