దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో జహీరాబాద్ నియోజకవర్గం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు, తాగు, సాగునీటి సౌకర్యాలు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీలో నిత్యం ఏదో ఒక సమస్య తలెత్తడంతో క్రషింగ్ నిలిచిపోయి రైతులు ఎంతో నష్టపోయేవారు. ఈ పరిస్థితులతో విసిగి వేసారిన ప్రజలు 2018లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాణిక్రావును గెలిపించుకున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషితో రూ.వేల కోట్లతో అభివృద్ధి జరుగుతున్నది. విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చి నియోజకవర్గంలో తొమ్మిది గురుకుల పాఠశాలలను ప్రభుత్వం నిర్మించింది. ప్రజల సమస్యలు స్థానికంగానే పరిష్కరించేందుకు జహీరాబాద్లో రెవెన్యూ, పోలీసు డివిజన్ కేంద్రాలు,నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయం ఏర్పాటు చేసింది. నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో క్యాంపు కార్యాలయం నిర్మించడంతో ఎమ్మెల్యే అందరికీ అందుబాటులో ఉంటున్నాడు. కొత్త పీహెచ్సీలు, సబ్స్టేషన్లతో నాణ్యమైన వైద్యసేవలు, విద్యుత్ సరఫరా జరగుతున్నది. ట్రైడెంట్ చెరుకు ఫ్యాక్టరీలో ఎలాంటి సాంకేతిక లోపాలు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు రైతులకు పంట మద్దతు ధర ఇప్పించింది.
జహీరాబాద్, మార్చి 30: భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందు నిజాం పాలన కింద ఉన్న కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చీట్గుప్పా తాలూకా కేంద్రంలో మారుమూల గ్రామంగా జహీరాబాద్ ఉండేది. దీంతో జహీరాబాద్కు అన్నిరంగాల్లో గుర్తింపు లేకుండా పోయింది. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడిన తర్వాత జహీరాబాద్ ఈ రాష్ట్రంలో విలీనమై తాలూకా కేంద్రంగా, శాసనసభ నియోజకవర్గంగా ఆవిర్భవించింది. ఆ తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వ్యాపార కేంద్రంగా ఎదిగింది. విభిన్న సంస్కృతులు ఉన్న ఈ ప్రాంతం జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నది. 1957 నుంచి ఎం.బాగారెడ్డి ఒకేపార్టీ కాంగ్రెస్ తరపున జహీరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఏడుసార్లు పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన మెదక్ ఎంపీగా మూడుసార్లు గెలిచి జాతీయస్థాయిలో జహీరాబాద్ పేరును నిలిపారు. 1957 నుంచి 2014 వరకు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినా ఆశించినంత అభివృద్ధి జరగలేదు. నియోజకవర్గంలో రోడ్లు, తాగునీటి సమస్యను పట్టించుకోలేదు. మధ్యలో 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎం. బాగన్న గెలుపొందారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఈ నియోజకవర్గంలో జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, రాయికోడ్ మండలాలు ఉండేవి. న్యాల్కల్ మండలం నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉండేది. 2009లో నియోజకవర్గ పునర్విజన జరగడంతో కొత్తగా మార్పు వచ్చింది. నియోజకవర్గంలో జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాలతో నియోజకవర్గం ఏర్పాటైంది. రాయికోడ్ను అందోల్ నియోజకవర్గంలో విలీనం చేశారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్న న్యాల్కల్ జహీరాబాద్ నియోజకవర్గంలో కలిపారు.
జహీరాబాద్ నియోజకవర్గ భౌగోళిక స్వరూపం..
జహీరాబాద్ శాసనసభ నియోజకవర్గానికి తూర్పున అందోల్ నియోజకవర్గం, వాయువ్య దిశన నారాయణఖేడ్ నియోజకవర్గం ఉన్నాయి. ఉత్తర, దక్షిణ, పడమర దిశలో కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జహీరాబాద్ అభివృద్ధిలో పరుగులు తీస్తున్నది. హైదరాబాద్, ముంబయి-65వ జాతీయ రహదారి ఉన్నందున వ్యాపారం, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధిస్తున్నది. నిమ్జ్ ఏర్పాటుతో పారిశ్రామిక ప్రగతి సాధిస్తున్నది.
మారిన రాజకీయ సమీకరణాలు…
జహీరాబాద్ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం.. ప్రస్తుతం బీఆర్ఎస్ కోటగా మారింది. బీఆర్ఎస్కు గ్రామస్థాయిలో మంచి క్యాడర్ ఉండడంతో పార్టీకి తిరుగులేని శక్తిగా మారింది. కాంగ్రెస్, బీజేపీలకు నియోజకవర్గంలో బలమైన నాయకులు లేకపోవడంతో ఆ పార్టీలకు మైనస్గా మారింది. తెలంగాణ ఉద్యమం నుంచి జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలం పెంచుకొని కాంగ్రెస్ కోటను బద్ధ్దలు కొట్టింది.
కాంగ్రెస్ హయాంలో అభివృద్ధికి దూరంగా జహీరాబాద్..
జహీరాబాద్ నియోజకవర్గంలో 1957 నుంచి 2009 వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నారు. మధ్యలో ఒకసారి 1994లో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు. వీరి పాలనలో నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి జరగలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కలిపించలేకపోయారు. జహీరాబాద్ పట్టణంలో విద్యాసౌకర్యాలు లేక విద్యార్థులు సంగారెడ్డి, హైదరాబాద్కు వెళ్లి చదివే పరిస్థితి ఉండేది. ప్రజలకు తాగునీటి కష్టాలు వేధించేవి. పల్లెలో వ్యవసాయ బావుల నుంచి తాగునీరు తెచ్చుకునే దుస్థితి ఉండేది. వాగు నీరు తెచ్చుకుని అవసరాలు తీర్చుకునేవారు. ఎక్కడ చూసినా వేసవిలో తాగునీటి కష్టాలు కనిపించేవి. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లేక రైతులు నష్టాలకు గురయ్యేవారు.
ట్రైడెంట్ చక్కెర ఫ్యాక్టరీలో ఎప్పుడూ బ్రేక్డౌన్లే…
జహీరాబాద్ ప్రాంతంలో అధికంగా రైతులు చెరుకు పంట సాగుచేసేవారు. అప్పటి ప్రభుత్వం నిజాం చక్కెర ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. ఫ్యాక్టరీ జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి)లో ఏర్పాటు చేయడంతో అప్పటి నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాల రైతులు ఎక్కువగా చెరుకు సాగుచేసే వారు. ప్రతి ఏడాది సీజన్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీలో సాంకేతిక లోపాలు రావడంతో వారం నుంచి 20 రోజుల వరకు చెరుకు క్రషింగ్ నిలిపేసే వారు. దీంతో చేనులో నరికేసిన చెరుకు ఎండిపోయి రైతులకు నష్టం జరిగేది. క్రషింగ్ నిలిచిపోవడంతో కొందరు రైతులు చెరుకును నరికి చేనులోనే గట్లపై పడేసిన రోజులు ఉండేవి. టీడీపీ హయాంలో నిజాం చక్కెర ఫ్యాక్టరీని ప్రైవేట్కు విక్రయించారు. ఫ్యాక్టరీ ప్రైవేట్ పరమైన తర్వాత చెరుకు సాగు తగ్గిపోయింది. చెరుకు రైతుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి రైతులకు మద్దతు ధరతో పాటు ఎలాంటి బ్రేక్డౌన్లు లేకుండా చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ పాలనలో చెరుకు రైతులకు మద్దతు ధర దక్కడం తో పాటు క్రషింగ్లో ఎలాంటి లోపాలు ఉండకుండా చర్యలు చేపట్టారు.
కాంగ్రెస్ హయాంలో విద్యకు దూరం..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతర వర్గాలకు నాణ్యమైన ఆంగ్ల విద్య అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి మండలంలో బాలుర, బాలికల గురుకులాలు ఏర్పాటు చేసింది. ఐదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ వరకు సర్కారు విద్యాలయాల్లో పిల్లలు చదువుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక మైనార్టీ, ఒక ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల మాత్రమే ఉండేది. బీఆర్ఎస్ హయాంలో అల్గోల్, బుచినెల్లి, కోహీర్లో మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. జహీరాబాద్ మండలంలోని రంజోల్, హోతి(కే) గ్రామంలో బాలికల గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాబోధన చేస్తున్నారు. కోహీర్, న్యాల్కల్, ఝరాసంగం మండలంలో జ్యోతిరావ్పూలే, సాంఘిక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశారు. మొగుడంపల్లిలో ఎస్టీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి విద్యాబోధన చేస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలో ప్రజల వద్దకు అధికారులు..
కాంగ్రెస్ హయాంలో డివిజన్ స్థాయి అధికారులు సంగారెడ్డిలో ఉండేవారు. వారు ప్రజలకు దూరంగా ఉండడంతో వారిని కలిసేందుకు జహీరాబాద్ నియోజకవర్గం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డికి వెళ్లి సమస్యలు తెలిపేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ జహీరాబాద్లో రెవెన్యూ, పోలీసు డివిజన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొత్తగా మొగుడంపల్లిని మండల కేంద్రంగా ఏర్పాటు చేశారు. సంగారెడ్డిలో ఉండే అధికారులు జహీరాబాద్కు రావడంతో ప్రజలకు పాలన చేరువైంది. గతంలో వ్యవసాయశాఖ అధికారులు మండలానికి ఇద్దరు ఉండేవారు. ఒక వ్యవసాయ శాఖ అధికారిగా, మరొకరు విస్తరణ అధికారిగా పనిచేసేవారు. వారు ఎప్పుడూ రైతులకు అందుబాటులో ఉండేవారు కాదు. బీఆర్ఎస్
పాలనలో 5 వేల ఎకరాలకు ఒక
వ్యవసాయ విస్తరణ అధికారి, ఒక వ్యవసాయ అధికారి పని చేస్తున్నారు. ప్రతిరోజు వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో రైతులకు మేలు జరుగుతున్నది. నియోజకవర్గంలో కొత్తగా పీహెచ్సీలు, సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడంతో వైద్యం, విద్యుత్ పరంగా ప్రజలకు మేలు జరుగుతున్నది. జహీరాబాద్లో నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయం, మొగుడంపల్లి, జహీరాబాద్, ఝరాసంగం, హద్నూర్ను డివిజన్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. గతంలో ఎమ్మెల్యేను కలిసేందుకు హైదరాబాద్కు వెళ్లే పరిస్థితి ఉండేది. గతంలో ఎమ్మెల్యేలు నెలకు ఒకటి, రెండుసార్లు నియోజకవర్గ కేంద్రానికి వచ్చి వెళ్లేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఎమ్మెల్యే ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేయడంతో ప్రజలకు చేరువయ్యారు. పల్లెల నుంచి ప్రజలు ఆటోలు, బస్సులు, బైక్లపై ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.
తెలంగాణ వచ్చినంక మస్తు అభివృద్ధి జరిగింది…
మా దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మస్తు ఏండ్లు పాలన సాగించిండ్రు. ఒక్క మంచి పనిజేయలేదు. రోడ్లు మంచిగుండకుండే. తాగునీరు దొరకకుండే. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక బీఆర్ఎస్ సర్కారు ఇంటింటికీ నల్లాల ద్వారా నీళ్లిస్తున్నది. గతంలో పెద్దసార్లను కలవాలంటే సంగారెడ్డికి పోవాల్సి వచ్చేది. గిప్పుడు అన్ని ఆఫీసులు జహీరాబాద్లనే ఏర్పాటు చేసిండ్రు. ఇప్పుడు అన్ని సౌలత్లు మంచిగైనయి.
– ఖాదీర్ అహ్మద్, భరత్నగర్ జహీరాబాద్
బీఆర్ఎస్ సర్కారులోనే జహీరాబాద్ అభివృద్ధి..
బీఆర్ఎస్ పాలనలోనే జహీరాబాద్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధించింది. కొత్తగా డివిజన్ కేంద్రం ఏర్పాటుచేశారు. మొగుడంపల్లిని కొత్తగా మండలం చేయడంతో ప్రజలకు మేలు జరిగింది. సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసి నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తున్నారు. రోడ్లు, తాగునీరు, కరెంట్ సమస్యలు తీరినయి. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి.
– శ్రీనివాస్ నాయక్, చిన్న హైదరాబాద్