ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు
ఐదు రోజులుగా టీచర్లకు కొనసాగుతున్న శిక్షణ తరగతులు
జిల్లాలో 23 కస్తూర్బా విద్యాలయాలు
పలు కేజీబీవీల అప్గ్రేడ్..
విద్యార్థినులకు ఇంటర్ చదివే అవకాశం
విద్యాలయాల్లో నాణ్యమైన బోధన
గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ను తగ్గించడం, బాల్య వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో(కేజీబీవీ) ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 23 కేజీబీవీలు ఉండగా.. ఈ ఏడాది ఆరు నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతారు. ఇందుకు గాను కేజీబీవీల్లో పనిచేస్తున్న 115 మంది ఉపాధ్యాయులకు ఐదు రోజులుగా నిపుణులతో శిక్షణ ఇస్తున్నారు. నేడు ఈ శిక్షణ శిబిరం ముగియనున్నది. అలాగే పలు కస్తూర్బా విద్యాలయాలను ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అదే విద్యాలయంలో ఇంటర్ పూర్తిచేసే అవకాశం విద్యార్థినులకు కలుగనున్నది.
గజ్వేల్ రూరల్, జూన్ 4: గ్రామీణ ప్రాంతాల్లో డ్రాపౌట్స్ను తగ్గించడం, బాల్య వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా ఏర్పాటైన కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ) ఎంతోమంది విద్యార్థినులకు వరంలా మారాయి. తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఎనిమిదేండ్ల కాలంలో విద్యార్థినులకు సకల వసతులతో నాణ్యమైన విద్యతో పాటు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తూ కస్తూర్బా విద్యాలయాను నిర్వహిస్తున్నది. జిల్లాలోని కొన్ని విద్యాలయాలను పదో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే కేజీబీవీల్లోనూ ఈ విద్య సంవత్సరం నుంచి ఇంగ్లిష్లో బోధన ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని 23 కేజీబీవీల్లో పనిచేస్తున్న ఎస్వోలు, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 1 నుంచి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నేటితో ఈ శిక్షణ తరగతులు ముగుస్తాయి.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి..
తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూలా మా ర్పులు తీసుకొస్తున్నది. ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం చదువులకు నోచుకొని గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని వారికోసం అందుబాటులోకి తెస్తున్నది. ‘మనఊరు-మనబడి’లో భాగంగా ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ విద్యను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత కేజీబీవీల్లోనూ ఇంగ్లిష్ విద్యను ప్రారంభించేందుకు జూన్ ఒకటో తేదీ నుంచి ఐదు వరకు ఇంగ్లిష్పై కస్తూర్బా విద్యాలయాల ఎస్వోలు, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల ఉపాధ్యాయులకు జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జడ్పీ పాఠశాలలో నిపుణులైన ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తున్నది. ఈ శిక్షణలో జిల్లాలోని 23 కేజీబీవీల్లో పనిచేస్తున్న 115 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఆరు నుంచి పదో తరగతి వరకు కేజీబీవీల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. కస్తూర్బా విద్యాలయాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ఏటా లక్ష పైచిలుకు రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.
అప్గ్రేడ్తో అందివచ్చిన అవకాశం..
జిల్లాలో 23 కేజీబీవీలు ఉండగా.. అందులో మొదటి విడతలో రాఘవాపూర్, గజ్వేల్ పాఠశాలల్లో ఇంటర్ వరకు తరగతులు ప్రారంభించారు. రెండో విడతలో మిరుదొడ్డి, మూడో విడతలో సిద్దిపేట అర్బన్, నాలుగో విడతలో చేర్యాల కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్ను ప్రవేశపెట్టడంతో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇక్కడే ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం చదివే అవకాశం కలిగింది. ఎంతో మంది పేద విద్యార్థులు పట్టణాల్లోకి వెళ్లి ఇంటర్ చదువుకొలేని, మధ్యలో మానేసే వారికి ఈ నిర్ణయం కలిసి వచ్చింది. గతేడాది పదో తరగతి, ఇంటర్లో కేజీబీవీ విద్యాలయాల్లో చదువుకున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు.
విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం..
కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్ల్లిష్ మీడియాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామం. ఎంతోమంది విద్యార్థినులకు ఇది మేలు చేసే నిర్ణయం. ఇంగ్ల్లిష్ మీడి యం చదువులపై నిపుణులైన అధ్యాపకులతో మాకు శిక్షణ ఇచ్చారు. శిక్షణలో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ప్రతి విద్యార్థి ఇంగ్ల్లిష్ చదువుపై శ్రద్ధ చూపే విధంగా ప్రత్యేక చొరవ తీసుకుంటాం.
–అనురాధ, ఎస్వో గజ్వేల్