నర్సాపూర్/చిలిపిచెడ్/కొల్చారం/శివ్వంపేట/ వెల్దుర్తి, నవంబర్30: నర్సాపూర్ నియోకవర్గంలో సార్వత్రిక ఎన్నిక పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. నర్సాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా 8 మండలాలు కలిపి 88.04 పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రా ల వద్ద బారులు తీరారు. నర్సాపూర్ పట్ణణంలోని పీఎస్ నెంబర్ 283 కేంద్రం వద్ద అరగంట పాటు ఈవీఎం మొరాయించడంతో ఓటింగ్ ప్రక్రియ కాస్త నెమ్మది సాగింది. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకి పోలింగ్ ముగియడంతో సిబ్బంది ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కి తరలించారు. వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. అధిక శాతం పోలింగ్ కేంద్రాల్లో పురుషులు కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు.
ఉమ్మడి వెల్దుర్తి మండలంలో మొత్తం 45 పోలింగ్ కేంద్రాలకు ఐదు రూట్లను ఏర్పాటు చేసి ఐదుగురు రూట్ అధికారులను నియమించారు. వెల్దుర్తిలో పోలింగ్ కేంద్రాలను అదనపు ఎస్పీ, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మహేందర్ పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి తన స్వగ్రామమైన మాసాయిపేటలో కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. మాసాయిపేట గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే విఠల్రెడ్డి సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండల కేంద్రాలైన వెల్దుర్తి, మాసాయిపేటలతో పాటు పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునితాలక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుల రాజిరెడ్డి, బీజేపీ అభ్యర్థి మురళీయాదవ్లు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో సిబ్బందిని పోలింగ్ జరుగుతున్న తీరు, ఎంత శాతం పోలింగ్ అయింది, ఏవేని సమస్య లు వచ్చాయా అని అడిగి తెలుసుకున్నారు. వెల్దుర్తిలోని 38వ పోలింగ్ బూతులో ఈవీఎం వద్ద సరైన వెలుతురు లేదని, దీంతో వృద్ధ్దులకు, కంటిచూపు సమస్య ఉన్నవారికి గుర్తులు కనిపించడం లేదని, వెలుతురు వచ్చేలా ఈవీఎంను ఏర్పాటు చేయాలని, లేదా ఈవీఎం వద్ద లైట్ను ఏరాటు చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని అభివృద్థి, సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. గురువారం వెల్దుర్తిలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అనంతరం స్థానిక నాయకులతో పోలింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. గతంలో మేనిఫెస్టోలో ప్రకటించినవే కాకుండా, ప్రకటించని ఎన్నో పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని, అదే విధంగా ఇప్పుడు కూడా చెప్పిన అన్ని పథకాల ను, హామీలను నెరవేర్చే సీఎం కేసీఆర్పై ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్నారు. గత పందేండ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, మూడోసారి హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్కు, బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతు విజయాన్ని అందింస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.