జహీరాబాద్, మే 5: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు గెలుపు కోసం ఎవరి ప్రయత్నలు వారు చేస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు గెలుపు కోసం జోరుగా ప్రచారం చేస్తున్నాయి. శాసనసభ ఎన్నికలు ఈ నెల 10న నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పూర్తిచేసింది. 8న అర్దరాత్రి నుంచే ప్రచారం నిషేధం అమలుచేశారు. 10న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కర్ణాటకలో 9, 10, 13న రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్య నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే జిల్లా రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు బీజేపీ అవినీతి, అక్రమలను ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీదర్, కలబుర్గా జిల్లాలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ ఆగ్రనేతలు జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోసారి విజయం సాధించాలని బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నా ప్రజల నుంచి అనుకున్నంత స్పందన రావడం లేదు. కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థులు తాగునీటి ఎద్దడి, ఆధ్వానంగా ఉన్న రోడ్లు, పారిశుధ్యం, రవాణా వ్యవస్థతో పాటు బీజేపీ అవినీతి, అక్రమాలపై ప్రచారం చేస్తున్నారు. కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు అధికారం ఇచ్చే అవకాశం ఉన్నదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
బీదర్ జిల్లాలో..
బీదర్ జిల్లాలో ఆరు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. పలు సర్వేలు ఫలితాలను చూసే బస్వకల్యాణ (కాంగ్రెస్), హుమ్నాబాద్(కాంగ్రెస్), బీదర్ దక్షిణ ( జేడీఎస్), బీదర్ (కాంగ్రెస్), బాల్కి (కాంగ్రెస్), ఔరాద్ (బీజేపీ) పార్టీలు ఎన్నికల్లో గెలిచే ఆవకాశం ఉన్నదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కలబుర్గా జిల్లాలోని చించొలి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు తెలుపుతున్నాయి.
కర్ణాటక ఎన్నికలకు కేంద్రంగా జహీరాబాద్
కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం కోసం వస్తున్న కేంద్ర మంత్రులు జహీరాబాద్లోని హోటళ్లలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పాటు ఎన్నికల ప్రచారంలో జరుగుతున్న వాటిపై ముఖ్య నాయకుల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. జహీరాబాద్లోని ఓ హోటల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రర్ సింగ్ తోమర్ బీదర్, కలబుర్గా జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. బీజేపీ కేంద్ర ముఖ్య నాయకులు హైదరాబాద్ నుంచి జహీరాబాద్కు వచ్చి ఇక్కడ ఉన్న హోటళ్లలో ఉండి, ఎన్నికల్లో గెలుపుపై నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ నాయకులు కూడా బీదర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీదర్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తూ మార్గమధ్యలో జహీరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు.