మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 21: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజులుగా ఉపవాసాలు ఉన్న ముస్లింలు నేడు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. సామరస్య భావాలకు, సమున్నత జీవన విధానానికి ప్రతీకగా, పరస్పర ప్రేమ, శాంతి, సహనాన్ని ప్రబోధించిన రోజుగా భావించే ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఈద్గాలను ముస్తాబు చేశారు. నిరుపేదలకు విస్మరించకూడదనే తాఖీదును అనుసరించి ప్రతి ముస్లిం తనకు తోచిన మేరకు ఫిత్రా(దానం) ఇస్తారు. పేద, ధనిక వ్యత్యాసం లేకుండా కుటుంబ సభ్యులందరి తరఫున ఫిత్రా చెల్లించాలనే వారి ఫర్జ్ (నియమం). రంజాన్ చివరి ఉపవాసం రోజు నెలవంక చూశాక ఈద్ నమాజ్కు వెళ్లే ముందు ఫిత్రా చెల్లిస్తారు. పండుగ రోజున ముస్లింలు ఉదయమే స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈద్గాల్లో ప్రార్థనల అనంతరం మత పెద్దల సందేశాలను శ్రద్ధగా వింటారు. ఆలింగనాలు చేసుకుని పరస్పర శుభాకాంక్షలు (ఈద్ముబారక్) తెలుపుకుంటారు.
ఈద్గా వద్ద ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్
నెలవంక కనిపించడంతో శనివారం రంజాన్ పండుగను చేసుకోవాలని మత పెద్దలు పేర్కొన్నారు. దీంతో పండుగను ఘనంగా నిర్వహించుకోవడానికి జిల్లా కేంద్రం మెదక్లోని ఈద్గా, మసీదులను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. నవాపేట వీధిలోని ఈద్గా వద్ద శనివారం ఉదయం వేలాది మంది ప్రార్థనలు చేయనుండడంతో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఈద్గా పరిసరాలను శుభ్రం చేయించారు. ఈద్గా వద్ద పనులను మున్సిపల్ కమిషనర్ జానకీరామ్ సాగర్ పర్యవేక్షించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ముస్లిం సోదరులకు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్ రంజాన్ శుభకాంక్షలు తెలిపారు.
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ను పురస్కరించుకొని జిల్లాలోని ముస్లింకు సంగారెడ్డి కలెక్టర్ శరత్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఓ ప్రకటన జారీ చేస్తూ మత సామరస్యానికి, ఐకమత్యానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్నారు. రంజాన్లో భాగంగా నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షతో అల్లాను ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ అల్లా కరుణాకటాక్షాలు ఉండాలని ఆకాంక్షించారు.