జహీరాబాద్, జనవరి 28 :‘దళితబంధు పథకంతో దళితుల తరతరాల తలరాత మారుతుంది.. సామాజిక, ఆర్థిక మార్పు వస్తుంది. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. పథకం అమలుతో లక్షలాది కుటుంబాలు బాగు పడుతాయి. ఆర్థిక స్వావలంబన సాధిస్తాయి. పథకం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించి ఆదేశాలిచ్చారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఫిబ్రవరి 5 వరకు గ్రామాలను ఎంపిక చేసి, లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు’.. అని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. దళితబంధు ఏర్పాట్లకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. నియోజకవర్గంలో ఒకటి, లేదా రెండు గ్రామాలను గుర్తించి పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామన్నారు. వంద యూనిట్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా గ్రామాల్లో పూర్తి పారదర్శకంగా అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, మార్చిలో యూనిట్లు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. వ్యాపారంలో శిక్షణనిచ్చి, వ్యాపార తీరును పర్యవేక్షించి వారు విజయవంతంగా ముందుకెళ్లడం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. మధ్యవర్తులు, దళారుల ఊసే లేకుండా, బ్యాంకులకు ఎలాంటి ష్యూరిటీలు లేకుండా లబ్ధిదారులకు నేరుగా రూ.10లక్షలిచ్చి, ఎక్కడైనా, ఏ వ్యాపారమైనా చేసుకునే ఆవకాశం కలిపించడం చరిత్రాత్మక నిర్ణయమని అభివర్ణించారు. మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే..
దళితబంధు పథకానికి చాలా ప్రత్యేకత ఉంది.. దీనిని ఎలా అమలు చేస్తారు?
నియోజకవర్గంలో దళితబంధు అమలు కావడం అదృష్టంగా భావిస్తున్నా. చాలా మంది పేద దళితుల బతుకులను మార్చేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు యూనిట్లు ఏర్పాటు చేసుకొనే అవకాశం కలిపిస్తాం. అవసరమైతే నా సొంత పరిచయాలు ఉపయోగించి, దళిత కుటుంబాలకు లాభం చేసేందుకు ప్రయత్నం చేస్తా.. యూనిట్ ధర రూ.10 లక్షలు దాటితే, అందుకు అనుగుణంగా లబ్ధిదారులను చేర్చి సమూహంగా ఏర్పాటు చేసే యూనిట్ మంజూరు చేస్తాం. యూనిట్ ధర రూ.20 లక్షలు ఉంటే ఇద్దరు లబ్ధిదారులకు వచ్చేలా చూస్తాం. పేదలు అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా పని చేస్తాం. దళితులు ఆర్థికంగా ఎదిగినట్లయితే వారి పిల్లలకు నాణ్యమైన చదువును అందించడంతో పాటు పది మందికి మేలు చేస్తారు.
లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీలో ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తారా? స్థానికంగా ఉండే అవసరాలగు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందిస్తారా?
దళితబంధు పథకంతో పేద దళిత కుటుంబాల్లో వెలుగులు ప్రసాదించాలన్నదే సీఎం కేసీఆర్ అంతిమ లక్ష్యం. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం ద్వారా పేద దళితులు వారి కాళ్లపై వారు నిలబడి, స్వయం ఉపాధి పొందేలా యూనిట్లు ఎంపిక చేస్తున్నాం. జహీరాబాద్ నియోజకవర్గంలో వ్యవసాయం, వ్యాపారం చేసుకొని, అనుబంధ పనులతో ఉపాధి పొందవచ్చు. వ్యవసాయ అనుబంధ పనులతో పాటు పారిశ్రామిక యూనిట్లు స్థాపించడానికి ప్రయత్నం చేస్తా. రూ.10 లక్షలతో లబ్ధిదారుడు గౌరవంగా లాభాలు పొందాలన్నదే ప్రభుత్వ సంకల్పం.
దళితబంధు రక్షణ నిధితో ఎలాంటి ఉపయోగం ఉంది?
దళితుబంధు పథకంలో ప్రతి లబ్ధిదారుని నుంచి రూ.10 వేలు తీసుకొని, రక్షణ నిధి ఏర్పాటు చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడికి ఆర్థికంగా కష్టం వచ్చినా, వ్యాపారంలో నష్టం వచ్చినా ఈ రక్షణ నిధి అక్కరకు వస్తుంది. లబ్ధిదారులను ఆదుకునేందుకు అవకాశముంటుంది. రక్షణ నిధి ఎంతో భరోసాగా ఉంటుంది.
దళితబంధు పథకానికి అర్హులైన వారిని ఎలా ఎంపిక చేస్తారు?
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం చాలా విశిష్టతలతో కూడుకున్నది. లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం రూ.10 లక్షలు విలువ చేసే యూనిట్ను అందిస్తున్నది. పథకం కోసం గ్రామాలను ఎంపిక చేసి, అర్హుల ఎంపికకు పేదరికం, సాంకేతిక నైపుణ్యం, ఆయా వృతుల్లో అనుభవాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటున్నాం. జహీరాబాద్ నియోజకవర్గంలో వంద మందికి పథకం అమలు చేస్తాం. దశాల వారీగా అందరికీ ఈ పథకం ఇస్తారు. ఫిబ్రవరి 5 వరకు లబ్ధిదారుల ఎంపిక, మార్చిలో యూనిట్లు అందజేస్తాం.
పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ప్రణాళిక ఎలా ఉండబోతున్నది?
రాష్ట్ర ప్రభుత్వం పేద దళితులకు అందించే రూ.10 లక్షలతో వారి కుటుంబాల తలరాతను మార్చేలా ఉపయోగించాలన్నదే నా లక్ష్యం. వందశాతం సబ్సిడీపై పేదలకు యూనిట్లు మంజూరు చేస్తున్నాం. గ్రామంలో అర్హులైన పేదలను ఎంపిక చేసేందుకు కృషి చేస్తాం.