సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరా బాద్ నగరంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏసీ బస్సులను పునరుద్ధరిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. ఈమేరకు నగరంలో ఎనిమిది ఈ-మెట్రో ఏసీ బస్సులను నడిపించాలని ఆర్టీసీ గ్రేటర్ జోన్ అధికారులు నిర్ణయించారు. కరోనా కంటే ముందు తిరిగిన ఏసీ బస్సులు ఆ తర్వాత నగరంలో కనుమరుగయ్యాయి. దీంతో ప్రయాణికుల అవసరాల దృష్ట్యా.. తిరిగి నగరంలో ఏసీ బస్సులను నడిపించాలని ఆర్టీసీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి ఏసీ బస్ సర్వీసులను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ జోన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి పటాన్చెరువు (రూట్ నంబర్ 219) ప్రాంతాల మధ్య మొత్తం ఎనిమిది ఏసీ బస్సులు నడుపుతామన్నారు. ఈమేరకు షెడ్యూల్ కూడా విడుదల చేశారు. సికింద్రాబాద్ నుంచి వయా ప్యారడైస్, బోయిన్పల్లి, బాలానగర్, కూకట్పల్లి మీదుగా వీటిని నడిపిస్తారు. ప్రతి 24 నిమిషాలకు ఒక బస్ సర్వీసు అందుబాటులో ఉంటుందన్నారు. సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ ఉదయం 6.10 గంటలకు ప్రారంభమవుతుంది. చివరి బస్సు రాత్రి 8.28 గంటలకు ఉంటుందన్నారు. పటాన్చెరువు నుంచి తొలి బస్సు ఉదయం 7.45కు బయలుదేరుతుందని, చివరి సర్వీసు 10.03 గంటలకు ఉంటుందన్నారు.