మెదక్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్నం వరకే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి కాలం దృష్ట్యా రెండు నెలల పాటు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించాలని ఐసీడీఎస్ అధికారులకు ఆదేశాలు అందాయి.
జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి మెదక్, రామాయంపేట, నర్సాపూర్, అల్లాదుర్గం. నాలుగు సెక్టార్ల పరిధిలో 1076 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటి లో గర్భిణులు 5481 మంది, బాలింతలు 5179 మంది, కిశోర బాలికలు 16,910 మంది ఉన్నారు. వీరితోపాటు ఏడు నెలల నుంచి సంవత్సరం వయస్సున్న చిన్నారులు 5867 మంది, ఏడాది నుంచి మూడేండ్ల వయస్సున్న చిన్నారులు 21,942 మంది. మూడేండ్ల నుంచి ఆరేండ్ల వయస్సున్నవారు 18,803 మంది ఉన్నారు. సాధారణంగా అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తారు. వేసవి ప్రారంభం కావడంతో మే 31వ తేదీ వరకు ఒక్క పూట తరగతులు నిర్వహించనున్నారు. నేటినుంచి అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గం టల వరకు తెరుచుకోనున్నాయి. ఉదయం 11 నుంచి 11:30 గంటల వరకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తారు. 12.30 గంటల తర్వాత చిన్నారులను ఇంటికి పంపిస్తారు.
మెదక్ జిల్లాలోని నాలుగు సెక్టార్ల పరిధిలోని పలు అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనంలోనే కొనసాగుతున్నాయి. ఇరుకు గదుల్లో విద్యుత్, తాగునీటి సౌకర్యాలు లేక చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అద్దె భవనాల్లో సెంటర్లు నడుస్తున్నా, తాగునీటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో ఒంటిపూట బడులు నిర్వహించడం చిన్నారులు ఉపశమనంగా మారింది. అంతేకాకుండా మే నెలలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు 15 రోజుల చొప్పున సెలవులు ప్రకటించనున్నారు.