చేర్యాల, జూలై 4 : సీఎం కేసీఆర్ పాలనలో సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి మహర్దశ పట్టింది. క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రత్యేకశ్రద్ధ వహించి భక్తులకు సకల వసతులు కల్పిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు గంటలకొద్దీ క్యూలైన్లలో వేచిఉండాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఆలయంలో కొత్తగా క్యూకాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఆలయ వర్గాలు శ్రీకారం చుట్టాయి. ఆలయ నిధులు రూ.12కోట్లతో క్యూలైన్లను నిర్మించేందుకు ఆలయ వర్గాలు ఆన్లైన్లో టెండర్లు పిలిచాయి. హైదరాబాద్కు చెందిన రామమంత్ర ఇన్ఫ్రా ఆగ్రోటెక్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పనులు చేసే హక్కులను దక్కించుకుంది. టెండర్ల ప్రక్రియ పూర్తికావడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు బుధవారం మల్లన్న క్షేత్రంలో క్యూకాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి భూమి పూజ చేయనున్నారు. నూతనంగా నిర్మించే క్యూకాంప్లెక్స్ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మంత్రి, ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ అధికారులు మల్లన్న క్షేత్రానికి రానుండడంతో ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశారు.
భక్తులకు తప్పనున్న తిప్పలు
మల్లన్న ఆలయ ధర్మకర్తల మండలి పాలనాపగ్గాలు చేపట్టిన అనంతరం జరిగిన మొదటి సమావేశంలో చేసిన తీర్మానం మేరకు నూతనంగా నిర్మించే క్యూకాంప్లెక్స్తో భక్తులకు తిప్పలు తప్పనున్నాయి. కొత్త క్యూకాంప్లెక్స్ నిర్మాణ పనులకు ఆలయ భూమిపొనూ ప్రైవేటు వ్యక్తుల స్థలాన్ని 1900 గజాలు సేకరించారు. స్థలం కోల్పోతున్న వ్యక్తులకు స్థలానికి స్థలంతోపాటు భవన నిర్మాణానికి ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు 11మందికి రూ.78లక్షల 46వేల 547 చెక్కులను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేతుల మీదుగా అందించారు. రోజురోజుకూ స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతుండడంతో మల్లన్న దర్శనానికి ఉత్సవాల సమయంలో 4 నుంచి 8 గంటల సమయం పడుతున్నది. ఈ క్రమంలో వేకువజామునే క్యూలైన్లలోకి ప్రవేశించిన భక్తులకు ఉదయం 9 తర్వాతే స్వామివారి దర్శనం అవుతున్నది. ఈ సమయంలో క్యూలైన్లో ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, షుగర్ తదితర వ్యాధులు ఉన్న వారు చాలా అవస్థలు పడుతున్నారు. తాగునీటి వసతి, టాయిలెట్స్, ఫ్యాన్లు లేకపోవడంతో వారి బాధలు వర్ణణాతీతంగా మారా యి. భక్తుల సమస్యను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాల మేరకు ఆలయ వర్గాలు కొత్త క్యూలైన్ల నిర్మాణానికి ఏకగ్రీవ తీర్మానం చేశాయి. దానిని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించి పనులకు శ్రీకారం చుట్టడడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
క్యూలైన్లలో అన్ని వసతులు
కొమురవెల్లి మల్లన్నక్షేత్రంలో నూతనంగా నిర్మించే క్యూలైన్లను ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు తిరుపతి, షిర్డీ, విజయవాడ ఆలయాల్లో ఉన్న విధంగా క్యూలైన్లను పరిశీలించారు. మల్లన్న క్షేత్రంలో నిర్మించే క్యూకాంప్లెక్స్ మూడు కాంపార్ట్మెంట్లు 60ఫీట్ల పొడవు, 30ఫీట్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఒక్కో గది(కంపార్ట్మెంట్)లో తాగునీటి వసతి, టాయిలెట్స్ నిర్మాణాలు, ఏసీలతోపాటు స్నాక్స్ విక్రయించే విధంగా క్యాంటీన్లు ఉండే విధంగా డిజైన్లు చేశారు. గతంలో ఇనుపరాడ్స్తో నిర్మించిన క్యూలైన్లను తొలిగించి వాటిస్థానంలో స్టెయిన్లెస్ స్టీల్ పైపులతో ఆధునిక వసతులతో క్యూలైన్స్ను నిర్మించనున్నారు. ప్రస్తుతం రాజగోపురం ఎంట్రెన్స్లో ఎడమవైపు ఉన్న క్యూలైన్స్ ఆలయ ప్రధానవీధిలో సగంవరకు వచ్చాయి. ఎల్లమ్మ ఆలయానికి బోనాలు తీసుకుపోయే భక్తులకు క్యూలైన్లో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు ఎదురుపడడంతోపాటు ఒకరిపై ఒకరు పడిపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక వాటికి చెక్ పెట్టేందుకు ఆలయవర్గాలు చర్యలు ప్రారంభించాయి. మల్లన్న క్షేత్రంలో భక్తులకు మరిన్ని వసతులు కల్పించేందుకు ఆలయ వర్గాలు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో రానున్న బ్రహ్మోత్సవాలకు కొత్త క్యూలైన్ల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు సేకరించిన స్థలంలో ఉన్న పాత భవనాలను తొలిగించి చదును చేశారు.
ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ
సీఎం కేసీఆర్ పాలనలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రానికి మహర్దశ పట్టింది. ఉమ్మడిరాష్ట్రంలో కొమురవెల్లి మల్లన్న ఆలయాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎంతో చరిత్ర, మహిమ కలిగిన మల్లికార్జునస్వామి కల్యాణోత్సవానికి కనీసం ఆర్డీవోస్థాయి అధికారి హాజరుకాకపోయేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం స్వామివారి కల్యాణోత్సవానికి సీఎం కేసీఆర్తోపాటు మంత్రివర్గం సైతం హాజరైంది. అనంతరం జరిగిన కల్యాణోత్సవాలకు మంత్రి హరీశ్రావుతోపాటు మంత్రు లు, అధికారులు హాజరవుతున్నారు. స్వామివారి క్షేత్రంలో కోట్లాది రుపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. తాజాగా మంత్రి ప్రారంభించే క్యూకాంప్లెక్స్తో భక్తులకు వసతి కలుగనుంది. ఇప్పటివరకు స్వామివారికి వెండి సింహాసనం, ఆలయంలో వెండితాపడం, స్వామివారికి బంగా రు కిరీటం చేయించాం. స్వామివారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి దానిని అమలు చేస్తున్నాం.
– ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్యే