సిద్దిపేట, జూలై 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా జోరుగా కొనసాగుతున్నది. ఆయా మందుల దుకాణాల్లో దొరుకుతున్న మందుల్లో ఏవి నకిలీవో..ఏవి అసలివో తెలియని పరిస్థితి నెలకొంది. మెడికల్ షాపు యజమానులు నకిలీ మందులు అమ్మి అందినకాడికి ప్రజల నుంచి దోచుకుంటున్నారు. అధికారుల అండదండలతో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. అసలు ఉమ్మడి మెదక్ జిల్లాలో డ్రగ్స్ అధికారులు ఉన్నారా… ? లేరా..? ఉంటే వారి కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి ఉంది. వారికి నెల నెలా మాముళ్లు అందితే చాలు ఇక ఆ మెడికల్ షాపులవైపు సైతం కన్నెత్తి చూడరు.
చాలా వరకు మందుల షాపుల్లో సర్టిఫికెట్ ఒకరిది నిర్వహణ మరొకరిదిగా మారింది. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. అనుమతులు లేకుండా ఇష్టారీతిగా మందుల దుకాణాలు వెలుస్తున్నాయి. అయినప్పటికీ ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. వర్షాకాలం ప్రారంభమైంది. ఓ వైపు జిల్లాలో వైరల్ జ్వరాలు వస్తున్నాయి. దీనిని ఆసరాగా చేసుకున్న కొంత మంది ఆర్ఎంపీలు, ఇతర ప్రైవేట్ దవాఖానల యజమానులతో కుమ్మక్కై వారి కనుసన్నల్లోనే మెడికల్ షాపులు పెట్టి నకిలీ మందులు అమ్ముతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
జ్వరం, దగ్గు, నొప్పులు, బీపీ, షుగర్ తదితర వాటికి వివిధ మెడికల్ షాపుల్లో నకిలీ మందులు రాజ్యమేలుతున్నాయి. నిజ జీవితంలో విరివిగా వాడుతున్న మందులను టార్గెట్ చేసుకొని ఆమందులనే నకిలీగా తెచ్చి అమ్ముతున్నారు. ఈ మందుల్లో నకిలీ, అసలు మందులు ఏవో గుర్తుపట్టకుండా ఉంటున్నాయి. వీటికితోడు కాలం చెల్లిన మందులను సైతం నిరక్ష్యరాస్యులకు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సంగారెడ్డి జిల్లాలోనే ఈ పరిస్థితులు ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనుమతులు లేకుండా ఇబ్బడి ముబ్బడిగా మందుల షాపులు వెలుస్తున్నా అడిగే వారే లేరు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట జిల్లాలో 750, మెదక్ జిల్లాలో 550, సంగారెడ్డి జిల్లాలో1300 వరకు మెడికల్ షాపులు ఉన్నట్లు సమాచారం. ఇవి కాకుండా ఇతర చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి.ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో నకిలీ మందులు వస్తున్నాయి.
అరికట్టాల్సిన అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. మాకేంది లే…మాకు నెల నెలా మామూళ్లు వస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వైద్యారోగ్యశాఖనే కాదు ప్రధానమైన అన్నిశాఖల తీరు ఇలానే ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన పూర్తిగా గాడి తప్పింది. అధికారులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. శాఖాపరమైన పనులు పక్కన పెట్టి పూర్తిగా సొంత పనులు, వ్యాపారాలపై దృష్టి సారించారు.
ఆయా మెడికల్ షాపులపై నియంత్రణ కరువైంది. అడిగే వారు లేక ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం సరిగ్గా అందడం లేదు. దీంతో ప్రైవేట్ దవాఖానల్లోకి ప్రజలు వెళ్తున్నారు. అక్కడికి వెళ్తే అక్కడ ఇష్టం వచ్చిన రీతిలో ఫీజులు గుంజుతున్నారు. మందులు అధిక రేట్లకు విక్రయించి అందినకాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అంతంతనే వైద్యం అందుతున్నది. క్షేత్ర స్థాయిలోపర్యవేక్షణ కరువైంది. మందుల కొరత, వైద్యులు సకాలంలో వైద్యం అందించడం లేదు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఎక్కడ ఉన్నారో తెలియదు. జిల్లాకు ఓ అధికారి ఉన్నారు అని చెప్పడం వరకే ..కానీ జిల్లాల్లో ఉండరు. ఇదేంటి అంటే మేము ఇతర జిల్లాలకు ఇన్చార్జీలుగా ఉన్నాము తాము అక్కడ కూడా చూసుకోవాలి కదా అంటూ సమాధానాలు చెబుతారు. దీంతో మెడికల్ షాపుల మీద పూర్తిగా నియంత్రణ కరువైంది.
మెడికల్షాపు యూనియన్లు ఏది చెబితే అది వినడమే అధికారుల వంతు.ఒక్కో షాపుల్లో నకిలీ మందులు ఉన్నా వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే సంబంధిత అధికారులకు మెడికల్ షాపుల నుంచి నెలనెలా మాముళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారు చెప్పినట్లు అధికారులు నడుచుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నకిలీ మందులను నియంత్రించాల్సిన అధికారులే మాముళ్లకు అలవాటు పడడంతో పాలన పూర్తిగా గాడితప్పింది.