సిద్దిపేట, మార్చి 10: పదేండ్ల తర్వాత సిద్దిపేట జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతుండంతో పంట పొలాలు ఎండుతున్నాయి. సిద్దిపేట నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రైతులు తమ పంట పొలాలను కాపాడుకోవడం కోసం బావుల్లో పూడికతీత పనులు, బోర్లు వేయిస్తున్నారు. దీంతో ఆర్థికంగా చితికి పోతున్నారు. లోఓల్టేజ్ కరెంటు సమస్యతో మోటర్లు కాలిపోవడంతో రైతులపై మరింత భారం పడుతున్నది. సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట మండలాల్లో రైతులు పంట పొలాలను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. కేసీఆర్ పాలనలో కరువన్నది లేకుండా ఆనందంగా వ్యవసాయం చేసిన రైతుల్లో ప్రస్తుతం కండ్లనిండా కన్నీళ్లు కనబడుతున్నాయి. ఒకో రైతు తన పంట పొలాన్ని కాపాడుకోవడానికి నాలుగు నుంచి 8 బోర్లను వేశారు. మరికొందరు పాతబావుల్లో పూడిక తీత పనులు చేపడుతున్నారు.
పొట్ట కొచ్చిన వరి పొలాన్ని కాపాడుకోవడం కోసం 15 రోజుల్లో ఆరు బోర్లు వేయించా. ఒకో బోరు 400 ఫీట్ల వరకు వేసినా చుక నీరు రాలేదు. దీంతో రెండు ఎకరాల వరి పొలం విడిచిపెట్టా. 25 గజాల లోతు ఉన్న బావి పందేండ్ల తర్వాత ఈసారి ఎండిపోయింది. ఆయిల్ పామ్, మామిడి తోటకు నీరందించాలనే ఈరోజు మళ్లీ బోరు వేయించా. ఇప్పటి వరకు సుమారు 5 లక్షల ఖర్చు చేశాం. జీవాలకు, బర్రెలకు తాగేందుకు కూడా నీళ్ల ఇబ్బంది ఏర్పడింది.
బావి పూర్తిగా ఎండిపోవడంతో పంటను రక్షించుకునేందుకు మూడు బోర్లు వేయించా. అందులో ఒక బోరులోనే కొద్దిగా నీళ్లు వచ్చినయ్. వాటితోనే కొంచెం పొలం పారుతున్నది. జొన్న చేను పూర్తిగా ఎండిపోయింది. దాదాపు లక్ష యాభై వేల వరకు బోర్లకు ఖర్చు పెట్టాం. నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం.
నాకు మూడు ఎకరాల పొలం ఉంది. రెండు ఎకరాల్లో పొలం ఏసిన. ఎకరం బీడుగా వదిలేశాను. బాయిలో నీళ్లు తగ్గడంతో పూడికతీస్తే నీళ్లు ఏమన్నా పెరుగుతాయేమో అని ఆశ ఉంది. వరితో పాటు కూరగాయలు సాగుచేశాం. నీళ్లు లేక కూరగాయల తోట ఎండిపోయింది. వరి పండుతుందన్న ఆశతోనే పూడిక తీయిస్తున్న. మస్తు తిప్పలు ఉంది. పూడిక తీయడంతో 50 వేల రూపాయల ఖర్చయ్యింది. పదేండ్లలో ఎన్నడూ నీళ్లకు కరువు రాలేదు. మళ్లా ఇప్పుడు గోస పడుతున్నం.