మద్దూరు(ధూళిమిట్ట), మార్చి29: ధూళిమిట్ట మండలంలోని లింగాపూర్లో వారం రోజులుగా తాగునీరు లేక గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులపై శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘తాగునీళ్లు మహాప్రభో..!’ అనే కథనాన్ని ప్రచురించడంతో మిషన్ భగీరథ అధికారులు స్పందించారు. మిషన్ భగీరథ డీఈఈ వేణుగోపాల్ ఆదేశాల మేరకు సూపర్వైజర్ బండ బాలరాజు గ్రామంలోని మిషన్ భగీరథ ఓవర్హెడ్ ట్యాంక్ను ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు పర్యాయాలు నింపి, నల్లాల ద్వారా నీటిని సరఫరా చేశారు.
ఈ సందర్భంగా డీఈఈ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ లైన్లో ఏర్పడిన సమస్యతో గ్రామంలో తాగునీటి సమస్య ఉత్పన్నమైన మాట వాస్తవమేనని, రాబోయే రోజుల్లో గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేసిన ‘నమస్తే తెలంగాణ’కు గ్రామస్తులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.