సంగారెడ్డి, మే 4 (నమస్తే తెలంగాణ) : వేసవి తాపానికి తోడు తాగునీటి కష్టాలతో సంగారెడ్డి జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఓవైపు ఎండలు మండుతుంటే.. మరోవైపు గుక్కెడు నీటి కోసం ప్రజలు తిప్పలు పడుతున్నారు. మిషన్ భగీరథ పథకం నిర్వహణ లోపంతో నారాయణఖేడ్, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని గ్రామాలు, తండాల్లోని తాగునీటి కష్టాలు ప్రజలను వేధిస్తున్నాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు, తండాలకు రెండురోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతున్నది.
దీంతో ప్రజలు, తండావాసులు మిషన్భగీరథ ద్వారా తాగునీరు సరఫరా కానిరోజు వ్యవసాయబోర్ల వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. జిల్లాలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 15.47 మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టాలు చేరుకున్నాయి. కంగ్టి మండలంలో అత్యధికంగా 27 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. నారాయణఖేడ్ ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు తగ్గి వ్యవసాయబోర్లు, తాగునీటి బోర్లు సైతం వట్టిపోతున్నాయి.
సంగారెడ్డి జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రజలు ఎక్కువగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు దాహార్తి తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం నిర్వహణను పట్టించుకోక పోవడంతో నీటి సమస్యలు ఎదురవుతున్నాయి. కరెంట్ కోతలకు తోడు మిషన్ భగీరథ పైప్లైన్లు తరుచూ పగిలిపోవడంతో పాటు లీకేజీలు అవుతున్నాయి. మిషన్భగీరథ సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేయకపోవడంతో నీటి వృథా జరుగుతున్నది. తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది.
నారాయణఖేడ్ పట్టణంలోని పలువార్డులతో పాటు కంగ్టి, నాగల్గిద్ద, సిర్గాపూర్, కల్హేర్ మండలాల్లోని పలు గ్రామాలకు మిషన్భగీరథ నీళ్లు రెండురోజులకు ఒకసారి సరఫరా అవుతున్నాయి. నాగల్గిద్ద మండలంలోని కుబ్బాతండా, గంగారం తండా, ఇరక్పల్లి తండాతోపాటు చుట్టుపక్కల ఉన్న పది తండాలకు రెండురోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతున్నది.
దీంతో గిరిజనులు వ్యవసాయక్షేత్రాల్లోని బోరుబావుల నుంచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. కంగ్టి మండలం జర్గితండా, దేగుల్వాడి, బోర్గి, బాన్సువాడ(డి) గ్రామాల్లో తరుచూ మిషన్భగీరథ వాటర్ రాకపోవడంతో వ్యవసాయ బోర్ల నుంచి తెచ్చుకుంటున్నారు. సిర్గాపూర్ మండలంలోని అంతర్గావ్తండా, గైరాన్తండా, రూప్లాతండా, చందర్తండా గిరిజనులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. కల్హేర్ మండలంలోని పోమ్యానాయక్తండా, నిజాంపేట మండంలంలోని బాచుపల్లి గ్రామస్తులు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఝరాసంగం మండలంలోని బోజ్యానాయక్ తండా, ఈదులపల్లి, ప్యాలవరం గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.
పటాన్చెరు మండలంలోని చిట్కుల్, ఇంద్రేశం, ముత్తంగి గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. ముత్తంగి వద్ద జాతీయ రహదారి పనులు జరుగుతుండడంతో మిషన్భగీరథ పైప్లైన్ తరుచూ దెబ్బతింటున్నాయి. నెలరోజులుగా ముత్తంగిలోని విజేత కాలనీ, పీఎస్కాలనీ, న్యూటౌన్ కాలనీలకు నీళ్లు సరిగ్గా రాక కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో తరుచూ మిషన్భగీరథ పైప్లైన్లు లీకేజీ జరుగుతున్నాయి. సంగారెడ్డి పట్టణంతోపాటు కంది, సంగారెడ్డి మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి పట్టణంలోని పలువార్డులకు మిషన్భగీరథ నీరు సరఫరా కావడం లేదు.