సంగారెడ్డి, జనవరి 23: ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్స్, పంచాయతీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ తదితరు శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడటం అత్యంత ప్రధానమైనదన్నారు. ప్రభుత్వ భూముల రక్షణ బాధ్యత రెవెన్యూశాఖదేనని, ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ము ఖ్యంగా మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ప్రభు త్వ భూముల్లో ఎలాంటి ఓపెన్ ప్లాట్స్, నిర్మాణాలకు ఇంటి నంబర్ ఇవ్వకూడదని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లోనూ అనుమతులు, ఇంటి నంబర్లు ఇవ్వొద్దని, ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అనుమతులు లేని నిర్మాణాలను నిలిపివేయాలని ఆదేశించారు. గ్రామకంఠం, నిషేధిత భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదని, ప్రభుత్వ భూముల్లో ఉన్న ఇంటి నంబర్లు వివరాలు అందించాలని మున్సిపల్ కమిషనర్లను కోరారు.
ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న భూము ల్లో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. రికార్డుల్లో ఉన్న ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిగానే ఉండాలని, రెవెన్యూ రికార్డుల్లో, క్షేత్ర పరిధిలో రెవెన్యూశాఖ ఆధీనంలో ఉండాలన్నారు. జిల్లా టాస్క్ఫోర్స్ కమిటీ తగిన చర్యలు చేపట్టి తహసీల్దార్ సహకారంతో ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను గ్రామవారీగా సర్వేనంబర్ల వారీగా చెక్ చేసి పది రో జుల్లోగా నివేదిక ఇవ్వాలన్నారు. జిల్లాలో ఎక్క డా ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, హెచ్ఎండీఏ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, నిమ్జ్ డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీవోలు, నీటిపారుదల శాఖ అధికారులు, తహసీల్దార్లు, ల్యాండ్ సర్వే అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డి, జనవరి 23: జిల్లాలోని హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న నీటి వనరులు ఆక్రమణకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేలో నీటిపారుదల, హెచ్ఎండీఏ, మైన్స్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పొల్యూషన్ బోర్డు, రెవెన్యూ, పంచాయతీ, హెచ్ఎండీఏ ఏరియా మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లతో నీటి వనరుల రక్షణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికాకుండా కాపాడాలన్నారు. రెవెన్యూశాఖ దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి తప్పులు జరగకుండా చూడాలని సూచించారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో ఉన్న చెరువులు ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉండాలని, మున్సిపల్ ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న నీటి వనరులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, హెచ్ఎండీఏ ఈఈ, డీఈలు, నీటిపారుదల శాఖ ఎస్ ఈ, ఈఈ, ఏడీ మైన్స్, డీపీవో, సంగారెడ్డి ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, సర్వే అండ్, ల్యాండ్ రికార్డ్స్ అధికారులు, పొ ల్యూషన్ బోర్డు ఈఈలు పాల్గొన్నారు.