సిద్దిపేట అర్బన్, మే 16: మరో వారం రోజుల్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. కరోనా తర్వాత యథావిధిగా పరీక్షలు నిర్వహిస్తున్నందున విద్యార్థులు ఏ విధంగా పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు..? పరీక్షలకు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి..? గతంలో కంటే జిల్లా ఫలితాల పరంగా ఏ విధంగా మెరుగుపడనున్నది..
తదితర విషయాలపై జిల్లా విద్యాధికారి కె.రవికాంతారావుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ. ..
ప్రశ్న : విద్యార్థులను పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం చేస్తున్నారు..?
డీఈవో: జిల్లాను ఎస్సెస్సీ ఫలితాల్లో ఈ సారి మొదటి స్థానంలో నిలుపడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు 50 రోజుల ప్రణాళిక రూపొందించుకొని విద్యార్థులకు పునఃశ్చరణ, వారంతపు టెస్ట్లు నిర్వహించాం. సాధారణంగా నిర్వహించే ప్రీ ఫైనల్ టెస్ట్, సమ్మెటివ్ టెస్ట్లతో పాటు అదనంగా రెండు ప్రాక్టీస్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు పరీక్షలపై భయం పోగొట్టి సిలబస్పై పూర్తి పట్టు సాధించేలా తయారు చేశాం.
కరోనా పాండమిక్ తర్వాత పరీక్షలు జరుగుతున్నాయి.. విద్యార్థులను ఏ రకంగా మానసికంగా పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు..?
డీఈవో: కరోనా అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొని పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నాటి నుంచి విద్యార్థులను మానసికంగా సిద్ధం చేస్తున్నాం. ప్రత్యేక తరగతులు, టెస్ట్లు నిర్వహించడంతో పాటు పరీక్షలకు వారం రోజుల ముందు డయల్ యువర్ టీచర్ పేరుతో విద్యార్థులకు ఉన్న సందేహాలను సబ్జెక్ట్ నిపుణులతో నివృత్తి చేసేందుకు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు ప్రతి రోజూ గంటన్నర సేపు ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టాం. ఇది విద్యార్థులకు సబ్జెక్టుపై సందేహాలు, పరీక్షల సరళి, రాసే విధానం తదితర అంశాలను నివృత్తి చేసేందుకు బాగా ఉపయోగపడుతుంది.
తరగతుల నిర్వహణకు తక్కువ సమయం ఉండటంతో ఆ ప్రభావం విద్యార్థులపై ఏమైనా ఉండే అవకాశం ఉందా..?
డీఈవో: గత సంవత్సరం సెప్టెంబర్లో తరగతులు ప్రారంభమైన నాటి నుంచి ముఖ్యంగా టెన్త్ విద్యార్థుల సిలబస్ పైన ప్రత్యేక దృష్టి సారించాం. అనుకున్న సమయానికి సిలబస్ పూర్తి చేసి నాటి నుంచి ప్రిపరేషన్పై దృష్టి పెట్టాం. ప్రభుత్వం సిలబస్ను 70 శాతానికి కుదించడమే కాకుండా ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ పరీక్షలకు సమయం పెంచింది. ఇది విద్యార్థులకు కొంత ఊరటనిస్తుంది.
ఈ సంవత్సరం ఎంత మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు..? ఎన్ని పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు..?
డీఈవో: 2022 సంవత్సరానికి గానూ జిల్లా వ్యాప్తంగా 83 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఈ పరీక్షా కేంద్రాల్లో మొత్తం 438 పాఠశాలల నుంచి 16,425 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 14,923 మంది రెగ్యులర్ విద్యార్థులు, 8 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పాటు 1,494 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు.
పరీక్షలు సజావుగా జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు..? ఎంత మం ది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు..?
డీఈవో: పరీక్షల నిర్వహణకు 857 ఇన్విజిలేటర్లు, 83 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 83 మంది డిపార్ట్మెంటల్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. అంతే కాకుండా పరీక్షలు పారదర్శకంగా జరిగేందుకు ఐదుగురు ఫ్లయింగ్ స్కాడ్స్, 9 మంది రూట్ ఆఫీసర్లు, 42 మంది జాయింట్ కస్టోడియన్లను నియమిం చాం. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నా పత్రం రిలీజ్ చేసి..పరీక్ష అనంతరం జవాబు పత్రాలు సీజ్ చేస్తాం.
ఓ వైపు ఎండకాలం, మరోవైపు కరోనా ప్రభావం ఉన్నందున.. పరీక్షా కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు..?
డీఈవో: జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యుత్ సౌకర్యం ఉండడంతో పాటు ఫ్యాన్లు, చల్లని తాగనీరు, టాయిలెట్లు, ఫర్నిచర్, ట్యూబ్లైట్ లాంటి సౌకర్యాలు ఉండేలా ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే పరీక్షా కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం, ఆశ వర్కర్ అందుబాటులో ఉంటారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మెడిసిన్లు అందుబాటులో ఉంచుతాం.
విద్యార్థులకు మీరిచ్చే సలహా ఏమిటి..?
డీఈవో: ఈ వారం రోజులే కీలక సమయం కనుక విద్యార్థులు టీవీలు, మొబైల్ ఫోన్లు పక్కకు పెట్టి శ్రద్ధగా చదువుకోవాలి. పరీక్షలు జరుగుతున్న సమయంలో కూడా ఎలాంటి టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రా యాలి. పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకుంటే ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా పరీక్షలు రాస్తారు. ప్రతి ఒక్క రూ 10 జీపీఏ సాధించాలని కోరుకుంటున్నా. ప్రతి విద్యార్థి విధిగా మాస్కు ధరించి పరీక్షకు హాజరు కావాలి. టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ నా ఆల్ ది బెస్ట్.