‘తెలంగాణలో గడపగడపకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆరే, రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.’ అని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, టీఆఎస్ హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలంలోని కొత్లాపూర్లో రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా ఆరుగురు లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పెట్టిన కష్టాలు రైతులు ఇప్పటికీ మర్చిపోలేదని, బీఆర్ఎస్ మూడు పంటలు కావాలా… కాంగ్రెస్ మూడు గంటలు కావాలా ప్రజలే తేల్చుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో మూడోసారి సీఎం కేసీఆర్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
సంగారెడ్డి, జూలై 17: సాగుకు మూడు పంటలు పండించేందుకు కరెంటు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా..? కేవలం మూడు గంటల కరెంటు ఇచ్చే కాంగ్రెస్ కావాలా? ప్రజలు తెల్చుకోవాలని చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం కొత్లాపూర్లో రెండో విడత గొర్రెల యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ గొర్రెలను ప్రకాశం జిల్లా నుంచి కొనుగోలు చేసి ఆరుగురు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 20గొర్రెలు, ఒక పొట్టే లు చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో గడపగడపకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని గుర్తుచేశారు. కులవృత్తులకు జీవం పోస్తూ గొల్లకుర్మలకు గొర్రెలను అందజేసి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూస్తున్నారని అన్నారు.
తెలంగాణ సర్కారుపాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఇతర రాష్ర్టాల ప్రజలు తమ రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆదర్శవంతమైన పాలనను చూసి ఓర్వలేకనే రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలపై ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు పెట్టిన కష్టాలను అన్నదాతలు ఇప్పటికీ మరువలేదని, కాంగ్రెస్కు అవకాశం ఇస్తే పాత రోజులు మళ్లీ వస్తాయన్నారు.
బీజేపీ రాష్ట్రంలో లబ్ధి పొందేందుకు మత విద్వేషాలు సృష్టిస్తున్నదని, ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీని దగ్గరికి రానివ్వొద్దన్నారు. రానున్న ఎన్నికల్లో మంచి మనసుతో మూడోసారి సీఎం కేసీఆర్ను గెలిపించి అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు వడ్ల వరకుమార్, ఆత్మకమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, కంది ఎంపీపీ సరళా, ఎంపీటీసీలు సామెల్, శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ సందీప్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చక్రపాణి, నాయకులు మనోహర్గౌడ్, సుదర్శన్రెడ్డి, వెంకటేశం, సత్యనారాయణ, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.