మునిపల్లి, ఏప్రిల్ 20 : రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. గురువారం మునిపల్లి ఎస్వీఎస్ గార్డెన్లో ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మతాలు, కులాలను సమానంగా గౌరవిస్తున్నదన్నారు. రాష్ట్ర బడ్జెట్లోనూ అన్ని వర్గాల వారికి సమానంగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. దీంతోపాటు ఆంగ్ల మాధ్యమంలో మెరుగైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.
మండలంలోని లింగంపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్తో రైతులు, నిరుద్యోగులకు ఉపయోగపడుతుందన్నారు. ఈ యూనిట్లో భూములు కోల్పోతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రూ.15 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తుందన్నారు. లింగంపల్లికి చెందిన 23 మంది రైతులకు నష్ట పరిహారం చెక్కులు అందజేశారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదుగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమన్నారు. మన పథకాలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు కాపీ కొట్టడం సిగ్గుచేటన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న పథకాలు నిజమైన అర్హులకు అందించడంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత బంధు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. సీఎం సహయనిధి పథకం కొండంత అండగా నిలుస్తున్నదన్నారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురికి సీఎం రిలీఫ్ఫండ్, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివకుమార్, ఎంపీడీవో అంజనీదేవి, జడ్పీటీసీ మీనాక్షీ సాయికుమార్, వైస్ ఎంపీపీ ఖమ్రోద్దిన్, సాయికుమార్, మండల పార్టీ అధ్యక్షుడు సతీశ్, ప్రధాన కార్యదర్శి శశికుమార్, యూత్ అధ్యక్షుడు ఆనంద్రావు, నాయకులు అల్లం నవాజ్రెడ్డి, రాంచందర్రావు పంతులు, రామకృష్ణ, మొగులయ్య, నరేశ్, వెంకటేశం తదితరులు ఉన్నారు.