పటాన్చెరు, జనవరి 5 : హెచ్ఎండీఏ వేలంలో పెట్టిన ప్లాట్లు కొనాలని, సంపూర్ణ రక్షణతో పాటు అన్ని రకాలు అనుమతులు పొందాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారులు, హెచ్ఎండీఏ అధికారులు వేలంలో పెట్టిన భూముల కొనుగోలుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డితో పాటు హెచ్ఎండీ ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, అసిస్టెంట్ సెక్రటరీ చంద్రయ్య, ఆర్డీవో నగేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూముల కొనుగోలుకు ఆసక్తితో ఉన్నవారికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందిన ప్రాంతంలోని భూములను వేలంలో అమ్ముతున్నదన్నారు. ఎలాంటి సమస్యలు, కేసులు లేని భూములను రెవెన్యూ యంత్రాంగం హెచ్ఎండీఏకు అమ్మకం కోసం ఇచ్చిందన్నారు. హెచ్ఎండీఏ జాతీయ స్థాయి సంస్థ ఎంఎస్టీసీకి వేలం నిర్వహణ బాధ్యతను ఇచ్చిందన్నారు. పూర్తి పారదర్శకమైన విధానంలో గోప్యత పాటిస్తూ భూములు అమ్ముతున్నామన్నారు. ఈ భూములను కొన్నవారికి వందశాతం గ్యారెంటీ, రక్షణ లభిస్తుందన్నారు. భూములు కొన్నవారు వ్యాపార, గృహ, ఇతర రంగాల నిర్మాణాలు చేసుకోవచ్చన్నారు. నాలా పన్ను, ఇతర అనుమతులను కూడా సత్వరమే అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురికాకుండా ప్రభుత్వం ప్రైమ్ ఏరియాలోని భూములను అమ్మకంలో ఉంచిందన్నారు. జనవరి 18న ఆక్షన్ ఉంటుందన్నారు. అమ్మకానికి పెట్టిన భూముల లొకేషన్ చూస్తామంటే సిబ్బంది వచ్చి చూపిస్తారని ఆయన చెప్పారు.
హెచ్ఎండీఏ అధికారులు మాట్లాడుతూ హెచ్ఎండీఏ జాతీయ సంస్థఐన ఎంఎస్టీసీ ద్వారా ఈ భూములను అమ్మకానికి ఆన్లైన్ వేలంలో ఉంచిందన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన 17 భూములు వేలంలో పెట్టామన్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతంలోని ఈ భూములకు మంచి ధర వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వివాదరహిత భూములను అమ్మకానికి ఉంచామని తెలిపారు. బిడ్డింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా పారదర్శకంగా ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ అంతా ఆన్లైన్లోనే ఉంటుందని తెలిపారు ఎంఎస్టీసీ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత రూ. 1,180లు కట్టి మీ పేరు రిజిస్టేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రతి బిడ్డరు రూ. 5లక్షల డిపాజిట్ చేయాలని, అవి భూములు కొన్నవారి అకౌంట్లో జమ అవుతాయన్నారు. భూములు వేలంలో రానివారికి ఆ డబ్బులు రిటర్న్ వస్తాయని తెలిపారు. ఎంఎస్టీసీ వెబ్సైట్లో మీ పేరున వ్యాలెట్ క్రియేట్ అవుతుందని చెప్పారు. మీ డబ్బులకు పూర్తి భరోసా ఉంటుందన్నారు. ఆన్లైన్లో ఎక్కడినుంచైనా వేలంలో పాల్గొనవచ్చన్నారు.
ఎవరు వేలం వేశారనే విషయం గోప్యతగా ఉంటుందని తెలిపారు వేలంలో భూమిని కొనుగోలు చేసిన వారు పదిరోజుల్లో 25శాతం డబ్బులు కట్టాలని, మిగిలిన డబ్బులు 90రోజుల్లో చెల్లించి భూమిని రిజిస్టేషన్ చేసుకోవచ్చనన్నారు. సంస్థ ఎన్వోసీ కూడా ఇస్తుందని, దానితో బ్యాంకర్ల వద్ద రుణం కూడా పొందవచ్చని సూచించారు. ఒక వేల 90 రోజుల్లో 75 శాతం డబ్బులు చెల్లించలేని వారు 10 శాతం సంవత్సర వడ్డీని హెచ్ఎండీఏకు చెల్లిస్తూ,180 రోజుల్లో భూమిని రిజిస్టేషన్ చేసుకునే సౌకర్యం ఉందన్నారు. బిడ్డింగ్లో చివరి నిమిషాల్లో ధరపెంచితే 8 నిమిషాల అదనపు సమయం ఇస్తామని చెప్పారు. ఆ అదనపు సమయంలో ఎవరైన మళ్లీ భూములకు అధిక ధర కోట్ చేస్తే మరో ఎనిమిది నిమిషాల టైం పొడిగించి ప్రభుత్వ ఆదాయం కోసం చూస్తామన్నారు. ఆ సమయంలో పూర్తి చేసుకున్న వెంటనే భూమి కొన్నట్టు ధ్రువీకరణ అందజేస్తామన్నారు. హెచ్ఎండీఏ అమ్ముతున్న భూములు బంగారంలా ప్రైమ్ ఏరియాలో ఉన్నాయని స్పష్టం చేశారు. బంగారు భవిష్యత్తు ఆభూములకు ఉం టుందని స్పష్టం చేశారు. సదస్సులో తహసీల్దార్ పరమేశ్, సిబ్బంది, వ్యాపారులు పాల్గొన్నారు.