మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. పరమపవిత్రమైన ఈ మాసం ఈనెల 16న ప్రారంభమైంది. సంక్రాంతికి నెలరోజుల ముందు సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం ప్రారంభమవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ముగుస్తుంది. ధనుర్మాసం ప్రారంభాన్ని పల్లెల్లో సంక్రాంతి నెల అంటారు. ఈనెల అంతటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. తిరుప్పావై ప్రవచనాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. చివరిరోజు జనవరి 14న గోదా రంగనాథస్వామి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించనున్నారు. నెల రోజులపాటు ధనుర్మాసవ్రతాన్ని ఆచరిస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
మద్దూరు (ధూళిమిట్ట), డిసెంబర్18: కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడుతాం. వాటిలో చాంద్రమాన, సౌరమానాలు ముఖ్యమైనవి. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దాన్నిబట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమాన్ని లెక్కిస్తారు. సూర్యుడు రాశిలోకి ప్రవేశించిన సమయాన్ని సంక్రమణం అంటారు. ఆయా రాశుల్లో సూర్యుడు సంచరించే కాలమును సౌరమాసం అంటారు. ఉదాహరణకు కర్కాటంలో సూర్యుడు ప్రవేశించే సమయం కర్కాటక సంక్రమణం అంటారు. కర్కాటక రాశిలో సంచరించే కాలం కర్కాటక మాసం అంటారు. సూర్యుడు ధనస్సురాశిలో ప్రవేశించిన సమయం ధనుస్సు సంక్రమణం అంటారు. మార్గశిర మాసంలో ధనురాశిలోకి సూర్యుడు ప్రవేశించి, మకర రాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీ కృష్ణుడు భగవద్గీతలో మార్గశిర మాసం యొక్క విశిష్టతను చెబుతాడు. ధనుర్మాసం ప్రాతఃకాలమువలె పవిత్రమైనది. సాత్వికమైన ఆరాధనలకు ప్రధానమైనది. కనుక సత్వగుణ ప్రధానమైన విష్ణువును ఈ నెలలోఆరాధిస్తారు. ఈ నెల విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. గోదాదేవి కథ ఈ మాసమునకు సంబంధించినదే. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించడాన్ని ‘పండుగ నెలపట్టడం’ అని కూడా అంటారు. ఈ నెల రోజులు ఇంటి ముందు పండుగ హడావుడిని గుర్తుచేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. అయితే ఈ ధనుర్మాసం సౌరమానానికి సంబంధించినది. కానీ తెలుగు వాళ్లంతా చాంద్రమాన అనుయాయులు కాబట్టి దీనికి గుర్తుగా ఈ ముగ్గు మధ్యలో చంద్రున్ని తీర్చిదిద్దుతారు.
కార్తిక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఉందని చాలా మంది భావిస్తారు. కానీ..ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల అని చాలా మందికి తెలియదు. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా.. ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి..దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి కరుణ, కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువుకి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ఈ ధనుర్మాసం రోజుల్లో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణువు ఆలయాల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటా రు. ధనుర్మాసం దేవతలకి బ్రహ్మీ ముహూర్తంలాంటిది. ఈ మకర, కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.
ధనుర్మాసం వచ్చిందంటే.. ఆలయాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం దేవాలయాల్లో ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకల్యాణం మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు సుప్రభాతానికి బదులు తిరుప్పావై గానం చేయడం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు, దరిద్రం దూరమవుతుంది. ఈ నెలలో ప్రతి రోజూ బ్రాహ్మీ ముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవుతారని ప్రతీతి. ఆ భూదేవి, అవతారమైన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో తిరు అంటే పవిత్రమైన పావై అంటే వ్రతం అని అర్థం. ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెండ్లికాని అమ్మాయిలు ఇంటి ముందు ముగ్గులు గొబ్బిళ్లతో పూజలు చేయడం వల్ల తాము కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళావ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. శ్రీ కృష్ణుడి ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు, నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతం గురించి బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి.
ఈ వ్రతం ఆచరించాలనుకునేవాళ్లు తమ స్థోమతను బట్టి విష్ణుప్రతిమని చేయించి పూజించాలి. ప్రతి రోజూ సూర్యోదయానికి ముందే స్నానాలు పూర్తిచేయాలి. పంచామృతాలతో మహావిష్ణువును అభిషేకించి తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి. నెలరోజులూ చేయని వాళ్లు 15 రోజులు, 8రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు.
ధనుర్మాసాన్ని పురసరించుకొని మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో అర్చకులు శ్రీ భాష్యం మధుసూదన్ చార్యులు, శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ నరేంద్ర చార్యులు వేకువ జామున స్వామి వార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నెలరోజుల పాటు సుప్రభాతానికి బదులు తిరుప్పావై పఠనం చేస్తూ, అర్థాన్ని, ధనుర్మాసం ప్రత్యేకత, విశిష్ఠతను భక్తులకు వివరించనున్నారు. ధనుర్మాసమంతా గోదాదేవి(ఆండాళ్) మార్గళివ్రతం పేరుతో విష్ణు వత్రం చేపట్టి స్వామి వారిని కీర్తిస్తారు. భూదేవి అవతారమైన ఆండాళ్ తల్లి రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రవిడ భాషలో తిరు అంటే ప్రవిత్రమైన, పావై అంటే వత్రం అని అర్థం. ఈ మాసంలో వైష్ణవ ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు చేస్తే మంచిదని అర్చకులు చెబుతున్నారు.
ధనుర్మాసం ఎంతో పవిత్రమైనది. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. భగవంతుడి సేవలో తరించేందుకు ఈ మాసం అత్యంత అనుకూలమైనది. వైష్ణవ సంప్రదాయస్తులకు ఈ మాసం ముఖ్యమైనది. సూర్యుడు ధనస్సునందు ప్రవేశించిన నుంచి ఉషకాలమందు విష్ణుమూర్తిని పూజిస్తే వెయ్యి సంవత్సరాలు పూజించినటువంటి ఫలం ఒక్క రోజుతో వస్తుందని భాగవతంలో చెప్పబడింది. వైష్ణవ ఆలయాల్లో ప్రతి రోజు తిరుప్పావై, విష్ణు సహస్రనామాలు పఠిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో నిరంతరం భగవన్నామ స్మరణ చేయాలి. ఈ మాసంలో వైకుంఠ ఏకాదశి, గీతాజయంతి, దత్తాత్రేయ పర్వదినాలు వస్తుండడం వల్ల ఆయా పర్వదినాల్లో భక్తులు భగవంతుడి సేవలో నిమగ్నమై ఆ భగవంతుడి కృపకు పాత్రులు కావాలి.
ఈ నెల 16న అర్ధరాత్రి ధనుర్మాసం ప్రారంభమై 2024 జనవరి 14 ముగుస్తాయి. అంటే మకర సంక్రాంతికి ముగుస్తుంది. ధనుర్మాసాన్ని శూన్యమాసంగా పిలుస్తారు. ఎందుకంటే సాధారణంగా దైవికమైన, పవిత్రమైన కార్యక్రమాలను తప్ప మరేదైనా నిర్వహించకూడదని పండితులు చెబుతున్నారు. ధనుర్మాసం సాధారణంగా డిసెంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ మాసాన్ని సాధారణంగా పూజా మాసంగా పరిగణిస్తారు. ఈ మాసంలో 23న ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, గీతాజయంతి, 26న దత్తాత్రేయ జయంతి, 30న సంకష్టహర చతుర్ధశి, జనవరి 4న కాలబైరవి జయంతి తదితర పర్వదినాలు వస్తుండడం విశేషంగా చెప్పుకోవచ్చు.